ఉక్రెయిన్పై గత వారం 800 బాంబులతో రష్యా విధ్వంసం !
ఉక్రెయిన్పై రష్యా గత వారం 800కుపైగా బాంబులతో విధ్వంసం సృష్టించింది. తాజాగా జపోరిజియా రీజియన్లోని విల్నియాన్స్క్ పట్టణంపై జరిపిన క్షిపణుల దాడిలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు. మరో ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 37 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. విలియాన్స్క్పై జరిగిన దాడిలో నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు, దుకాణం దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆండ్రీ కోస్తిన్ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైన్యానికి మరిన్ని దీర్ఘశ్రేణి ఆయుధాలు అందజేయాలని, గగనతల రక్షణ వ్యవస్థలు సమకూర్చాలని పశ్చిమ దేశాలను కోరారు. ''గత ఒక్క వారంలోనే ఉక్రెయిన్పై రష్యా 800కుపైగా గైడెడ్ ఏరియల్ బాంబులను ప్రయోగించింది. ఇవి తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో మాస్కో యుద్ధ విమానాలతోపాటు ఆ బాంబులను ప్రయోగిస్తున్నవాటిని నాశనం చేసేందుకు మాకు మరింత తోడ్పాటు అవసరం. దీర్ఘశ్రేణి ఆయుధాలు, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు ఈ దాడులను నిరోధించగలవు'' అని జెలెన్స్కీ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.