పోలింగ్‌ డేటాను మార్చడం అసాధ్యం !


పోలింగ్‌ డేటాను మార్చడం అసాధ్యమని ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. పోలింగ్‌ శాతాలపై తప్పుడు కథనాలు రూపొందిస్తున్నారని ఆరోపించింది. లోక్‌సభ ఎన్నికల ఐదు దశలకు సంబంధించిన సంపూర్ణ పోలింగ్‌ వివరాలు, ఓటు వేసిన వారి పూర్తి శాతాలను శనివారం విడుదల చేసింది.  పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లోపు ప్రతి బూత్‌లో పోలైన, తిరస్కరించిన ఓట్లతో సహా పోలింగ్‌ డేటాను విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రతి దశ పోలింగ్‌ తర్వాత డేటాను సంకలనం చేసి వెబ్‌సైట్‌లో ప్రచురించేలా ఈసీని ఆదేశించాలని ఆ పిటిషన్లలో కోరారు. ఈ పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కాగా, పోలింగ్‌ ముగిసిన తర్వాత ఓటింగ్‌ శాతాలు పెరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఈసీ స్పందించింది. ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేందుకు ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. సుప్రీంకోర్టు పరిశీలనలు, తీర్పుతో ఓటింగ్‌ శాతం డేటా విడుదల ప్రక్రియ మరింత బలపడుతుందని పేర్కొంది. అయితే డేటా విడుదల కసరత్తు మొత్తం కూడా ఎలాంటి తేడా లేకుండా కచ్చితమైన, స్థిరమైన, ఎన్నికల చట్టాలకు అనుగుణంగా జరుగుతుందని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రజాస్వామ్యం కోసం నిరాటంకంగా సేవ చేయాల్సిన ఉన్నతమైన బాధ్యత కమిషన్‌పై ఉందని గుర్తు చేసింది. ఏప్రిల్‌ 19 నుంచి ముగిసిన ఐదు దశల సంపూర్ణ పోలింగ్‌ వివరాలను ఈసీ శనివారం విడుదల చేసింది. ప్రతి దశలో పోలింగ్ రోజున ఉదయం 9.30 గంటల నుంచి 'ఓటర్ టర్నింగ్ యాప్' లో డేటా ఎల్లప్పుడూ 24×7 అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రతి దశలో సాయత్రం 5.30 గంటల వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి కొత్త పోలింగ్‌ శాతాలను పేర్కొంటామని చెప్పింది. ప్రతి దశ పోలింగ్‌ అనంతరం సాయంత్రం 7 గంటల తర్వాత నుంచి డేటాను నిరంతరం అప్‌డేట్‌ చేస్తామని ఈసీ తెలిపింది. పోలింగ్ రోజు అర్ధరాత్రి నాటికి, ఓటరు సంఖ్య యాప్ ద్వారా 'క్లోజ్ ఆఫ్ పోల్' డేటా శాతాన్ని ఉత్తమంగా అంచనా వేయవచ్చని వెల్లడించింది. పోలింగ్‌ ప్రాంతాల్లోని భూగోళ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పోలింగ్‌ సిబ్బంది తిరిగి చేరిన తర్వాత సంపూర్ణ పోలింగ్‌ శాతాలు, రీ పోలింగ్‌ అవసరం గురించి పూర్తి స్పష్టత వస్తుందని వివరించింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org