అవినీతి నిరోధక శాఖ చిక్కిన ఏసీపీ ఉమామహేశ్వరరావు !
హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ టి.ఎస్.ఉమామహేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కారు. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్ అశోక్నగర్లోని ఏసీపీ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని 14 చోట్ల ఏకకాలంలో మరిన్ని బృందాలు సోదాలు జరిపాయి. ఉమామహేశ్వరరావు సోదరుడితోపాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగాయి. సోదాల్లో భారీగా రూ.500 నోట్ల కట్టలను, ఆభరణాలను, 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను గుర్తించారు. ఇప్పటివరకు విశ్లేషించిన సమాచారం మేరకు ఆదాయానికి మించిన ఆస్తుల విలువ రూ.3.46 కోట్ల వరకు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రెట్టింపు ఉంటుందని భావిస్తున్నారు. సోదాలను అనిశా సంయుక్త సంచాలకుడు సుధీంద్ర పర్యవేక్షించారు.