మేడిగడ్డపై ఎల్ అండ్ టీ నిషేధాజ్ఞలు !
మేడిగడ్డపై గేట్లు బంద్ చేసి ప్రాజెక్టు పైకి ఎవరినీ వెళ్ళనీయకుండా ఎల్అండ్ టీ సంస్థ నిషేధాజ్ఞలు విధించింది. మీడియాను కూడా అనుమతించడం లేదు. రిపేర్లు చేస్తుండగా బ్యారేజీ 20, 21వ పియర్ల పక్కన భారీ బొయ్యారం బయటపడటం, మీడియాలో రావడంతో ఎల్అండ్ టీ సంస్థ ఇవాళ గేట్లు మూసి వేసింది. అనుమతి ఉన్న వ్యక్తులకు తప్ప మిగతా వారెవరికీ ప్రవేశం లేదంటూ బోర్డు ఏర్పాటు చేసింది. గోదావరిలో ఇప్పుడు వస్తున్న రెండు వేల క్యూసెక్కుల వరద తాకిడికే ఇసుక కొట్టుకుపోయింది. అసలు భారీగా వరద వస్తే ఏమిటి..? ఇంతకూ ప్రాజెక్టు ఉంటుందా..? పేక మేడలా పడిపోతుందా..? అన్న అనుమానాలు వస్తుండడంతో దానిని కప్పి పుచ్చుకొనేందుకు ఇంజినీర్లు బొయ్యారంలో నల్లమట్టిని నింపారు. అయితే ఇవాళ ఉదయం గేట్లు మూసేయడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఏమైనా భారీ లోపాలు బయటపడ్డాయా ? మీడియా కంట పడకుండా రిపేర్లు చేసేందుకే నిషేధాజ్ఞలు విధించారా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గేట్లు మూసేయడంతోపాటు అక్కడ ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.