అక్టోబర్ నుంచి 5జీ సేవలు ?


టెలికాం సంస్థలకు 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపు ఈ నెల 10 కల్లా పూర్తవుతుందని, వచ్చే అక్టోబర్ నుంచి 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని  కేంద్ర టెలికాం శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. త్వరలో ప్రారంభం కానున్న 5జీ సేవల గురించి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ''ఈ నెల పదో తేదీకల్లా టెలికాం సంస్థలకు 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపు పూర్తవుతుంది. అక్టోబర్ నుంచి ఈ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 5జీ ఎక్విప్‌మెంట్ త్వరగా ఏర్పాటు చేసి, సేవలు ప్రారంభించాల్సిందిగా సంస్థలను కోరుతున్నా. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. మన దేశంలోనే టెలికాం సేవల ఛార్జీలు చాలా తక్కువ. 5జీ సేవలు కూడా ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉంటాయనుకుంటున్నా. అమెరికా, యూరప్ దేశాలతో పోలిస్తే మన దేశంలో టెలికాం సర్వీసుల ద్వారా వచ్చే రేడియేషన్ దాదాపు పది రెట్లు తక్కువగా ఉంది. రేడియేషన్ తక్కువగా ఉందంటే మనం నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లే. సురక్షితమైన వాతావరణంలోనే మనం ఉన్నాం. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక.. 5జీ ఫోన్ల అమ్మకాలు బాగా పెరుగుతాయి. మొబైల్ ఫోన్ల తయారీలో మనం రెండో స్థానంలో ఉన్నాం. 25-30 శాతం వరకు 5జీ ఫోన్లు తయారు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 5జీ ఫోన్ల ధరలు తగ్గుతూనే ఉంటాయి'' అని అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org