ఐ ఫోన్‌లను అధికంగా కొంటున్న భారతీయులు


భారతీయులు ఐఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని యాపిల్ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. కంపెనీ రాబడి వృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. 2022 ఆర్ధిక సంవత్సరం మూడో క్వార్టర్ ఆర్ధిక ఫలితాలను యాపిల్ వెల్లడించింది. బ్రెజిల్‌, ఇండోనేషియా, వియత్నాంల్లో రెండంకెల వృద్ధితో పాటు భారత్‌లో కంపెనీ ఆదాయం దాదాపు రెండింతలైందని టిమ్ కుక్ పేర్కొన్నారు. ఈ క్వార్టర్‌లో 83 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కంపెనీ ఆర్జించింది. ఐఫోన్ల వ్యాప్తి తక్కువగా ఉన్న ఇండోనేషియా, వియత్నాం, భారత్ వంటి దేశాల్లో అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని కుక్ తెలిపారు. కంపెనీ రాబడిలో ఐఫోన్ నుంచే అధిక ఆదాయం నమోదైంది. కంపెనీ మొత్తం రాబడిలో ఐఫోన్ సేల్స్ ద్వారా సమకూరిన ఆదాయం 50 శాతం వరకూ ఉండటం గమనార్హం. ఇక ఈ క్వార్టర్‌లో ఐపాడ్స్‌, ఎయిర్‌పాడ్స్‌, వాచ్ విభాగం నుంచి రాబడులు పడిపోయాయి. ఇక గత క్వార్టర్‌లో కొవిడ్ నియంత్రణలతో పాటు పలు ప్లాంట్లలో ఉత్పత్తి సామర్ధ్యం తగ్గడం వంటి అవరోధాలు ఎదురయ్యాయని కుక్ చెప్పారు. అమెరికా, బ్రెజిల్‌, మెక్సికో, కొరియా, భారత్ సహా పలు దేశాల్లో యాపిల్ సర్వీసులు రికార్డులు నెలకొల్పాయని కంపెనీ సీఎఫ్ఓ లుకా మయస్త్రీ వివరించారు. విప్రో వంటి కంపెనీలు ఉద్యోగులను కాపాడుకునేందుకు, నైపుణ్యాలను ఆకర్షించేందుకు యాపిల్ ప్రోడక్ట్స్‌పై గణనీయంగా వెచ్చించాయని తెలిపారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org