షావోమీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదును ఫ్రీజ్ చేసిన ఈడీ
షావోమికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. దేశంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో షావోమి ఇండియాకి చెందిన రూ. 5 వేల 5 వందల 51 కోట్ల నగదును ఈడీ ఫ్రీజ్ చేసింది. నాలుగు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదును ఫ్రీజ్ చేసింది. అప్పటికే ఈ చైనా ఫోన్ తయారీ సంస్థ భారీగా నగదును విదేశాలకు తరలించింది. 2014 నుంచి దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న షావోమి పలు ఆర్థిక అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. గత ఫిబ్రవరిలో షావోమి కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. భారీగా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మన దేశంలో షావోమి ఏటా 34వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారం చేస్తోంది. ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్ క్యారియర్లతో మొబైల్ ఫోన్లు తయారు చేయిస్తుందీ షావోమి. షావోమి చైనాతో వీటికి ఒప్పందం ఉంది. షావోమీ ఇండియాతో వీటికి ఎలాంటి ఒప్పందం ఉండదు. ఈ సంస్థలకు ఎలాంటి టెక్నాలజీ, సాఫ్ట్వేర్ సపోర్ట్ను షావోమి ఇండియా సమకూర్చదు. కానీ మూడు విదేశీ సంస్థలకు షావోమీ ఇండియా భారీగా నగదును మళ్లించింది. వాటి నుంచి ఎలాంటి సేవలు పొందకపోయినా నగదును పొందినట్లు చూపి నగదు తరలించింది. ఇందుకోసం తప్పుడు పత్రాలు సృష్టించింది. బ్యాంకులకు తప్పుడు సమాచారం ఇచ్చింది. ఇది ఫెమా నిబంధనలను ఉల్లంఘించడమేనని ఈడీ తేల్చింది. ఆ సంస్థ గ్లోబల్ వైస్ప్రెసిడెంట్ మనుకుమార్ జైన్ను కూడా ఇటీవల ఈడీ విచారించింది. విచారణ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టనుంది. అయితే ఇప్పటికే వివిధ ఖాతాల నుంచి నగదును మళ్లించిన షావోమి ఇండియా మిగిలిన మొత్తాన్ని కూడా దేశం దాటిస్తుందేమోనన్న అనుమానంతో 5వేల కోట్లకు పైగా నగదును ఈడీ ఫ్రీజ్ చేయించింది.