కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదవ్వడంతో జనసేన పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జనసేన పార్టీలో జానీ మాస్టర్ క్రీయాశీలకంగా పనిచేస్తుండటంతో కేసు నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీని పార్టీ ఆదేశించింది. ఈమేరకు అధికారిక ప్రకటనను జనసేన విడుదల చేసింది. వేములపాటి అజయ్‌ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది. జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. కొంతకాలంగా జానీ మాస్టర్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్‌కు ఆయన మద్దతు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ జనసేన పార్టీకి ప్రచారం చేశారు. జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు పెట్టింది. ఆరోపణలు చేస్తున్న యువతి 2017లో ఓ ఛానల్‌లో ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ షోలో జానీ మాస్టర్‌కు పరిచయమైనట్టు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత జానీ మాస్టర్‌కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఉండాలంటూ ఆయన టీమ్ యువతికి ఫోన్ కాల్ చేశారు. 2019లో జానీ మాస్టర్ టీమ్‌లో సదరు యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఒక షో కోసం జానీ మాస్టర్‌తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లినప్పుడు బస చేసిన హోటల్లో జానీ అత్యాచారానికి పాల్పడ్డాడని ఎఫ్‌ఐఆర్ ఉంది. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించారని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. షూటింగ్ సమయాల్లో అతడు చెప్పినట్టు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి పేర్కొంది. తరచూ తనపై జానీ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిపింది. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం చేశారని ఆమె ఆరోపించింది. వీటికి ఒప్పుకోకపోవడంతో జుట్టు పట్టుకొని జానీ మాస్టర్ దాడి చేశారని తెలిపింది. ఆగస్టు 28న ఒక వింత పార్శిల్ వచ్చిందని.. పేరు లేకుండా తన ఇంటి తలుపునకు వేలాడదీయబడిందని.. దాని లోపల ''Congratulations for son be care full'' అని రాసి ఉందని బాధితురాలు వెల్లడించింది. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదయింది. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. ఫిర్యాదు చేసిన యువతి వయసు 21 సంవత్సరాలు. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. కాగా ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని అక్కడికి బదిలీ చేశారు. ఔట్ డోర్ షూటింగులలో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి కేసును బదిలీ చేశారు.

Post a Comment

Previous Post Next Post