బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ మార్పుల కారణంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా రాబోయే ఏడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా సెప్టెంబర్ 19 నుండి 23 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు నమోదు కావచ్చని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లోనూ రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. వర్షాల వేళ ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు వాహనదారులు ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలని సూచించారు.

Post a Comment

Previous Post Next Post