హైదరాబాద్ నగరంలో ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లపై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉంటోంది. ప్రయాణికుల రద్దీ రోజురోజుకు తీవ్రమవుతుండటంతో రైళ్లను నియంత్రించలేకపోతున్న అధికారులు ప్రత్యామ్నాయంగా చర్లపల్లి రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నారు. అతి త్వరలోనే జంటనగర వాసులకు ఇది అందుబాటులోకి రాబోతోంది. రూ.434 కోట్ల బడ్జెట్ తో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వేస్టేషన్ గా చర్లపల్లి నిలవబోతోంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. అతి త్వరలోనే దీన్ని ప్రారంభించబోతున్నారు. కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి ట్విటర్ వేదికగా స్టేషన్ ఫొటోలను షేర్ చేశారు. తొమ్మిది ప్లాట్ ఫామ్స్ తో ఉన్న చర్లపల్లి రైల్వేస్టేషన్ అందుబాటులోకి వస్తే ఇతర స్టేషన్లపై రద్దీ తగ్గుతుందని, అలాగే ఎంఎంటీఎస్ రైళ్లు, దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్ల మధ్య మారడానికి ఇది వీలు కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ప్రస్తుతం పునర్మిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిని శరవేగంగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఆరు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే మరో 12 రైళ్లను ఇక్కడ ఆపేందుకు అనుమతులు రావడంతో దానికి సంబంధించిన విధివిధానాలను అధికారులు రూపొందిస్తున్నారు. ఈ స్టేషన్ ను ఎప్పటి నుంచి వినియోగించుకోవాలనే విషయాన్ని రైల్వే బోర్డు స్థానికంగా ఉన్న అధికారులకే కట్టబెట్టడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. లింగంపల్లి నుంచి నడిచే కొన్ని రైళ్లను సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చే అవసరం లేకుండా సనత్ నగర్, మౌలాలి మీదుగా చర్లపల్లి చేరుకునేలా తిప్పబోతున్నారు. పశ్చిమబెంగాల్, ఒడిసా, బీహార్, ఢిల్లీ లాంటి దూరప్రాంతాలకు ప్రయాణించే రైళ్లను చర్లపల్లి నుంచి నడపబోతున్నారు.
Post a Comment