నేపాల్ లో గతవారం సంభవించిన వరదలలో మృతుల సంఖ్య 1000కి చేరువైంది. గల్లంతైన వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భారీ వర్షాలు, బురద, దెబ్బతిన్న రహదారులు, మూసుకుపోయిన సొరంగాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి. నేపాల్ సహాయక బృందాలు, వివిధ దేశాల రెస్క్యూ టీంలు రంగంలోకి దిగి గాలింపు కొనసాగిస్తున్నాయి. తాజాగా నువాకోట్ జిల్లాలోని బెత్రావతిలో ఈ ఉదయం ఓ ఇంట్లో 23 మృతదేహాలు బయటపడటం తీవ్ర విషాదాన్ని నింపింది. వరదల తర్వాత గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా ఈ మృతదేహాలను గుర్తించారు. అవి ఒకే కుటుంబానికి చెందినవా? చుట్టుపక్కల వాళ్లు తలదాచుకునేందుకు వచ్చి మరణించారా? లేదంటే కొట్టుకు వచ్చిన మృతదేహాలా? అని పరిశీలిస్తున్నారు. మరోవైపు నేపాల్ నుంచి కొట్టుకొచ్చినట్లు భావిస్తున్న 13 మృతదేహాలు ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ సమీపంలోని గండక్ నదిలో లభించాయి. వీరిలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాలను నేపాల్కు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 933 మంది కార్మికుల జాడ లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. రసువా, నువాకోట్ జిల్లాల్లోని పలు సొరంగాల్లో కార్మికులు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. త్రిశూలీ 3ఏ ప్రాజెక్టులో పనిచేస్తున్న 40-42 మంది ఇంజినీర్ల ఆచూకీ ఇంకా లభించలేదు. త్రిశూలీ 3బీ ప్రాజెక్టులో 118 మంది కార్మికులు గల్లంతయ్యారు. బురద, నీటితో సొరంగాలు పూర్తిగా మూసుకుపోవడంతో సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆర్మీ సిబ్బంది నియంత్రిత పేలుళ్లు, ఎక్సకవేటర్లు, సెర్చ్లైట్లను ఉపయోగించి మార్గాలను క్లియర్ చేస్తున్నారు. అయితే కెమెరాల్లోనూ లోపల నిశబ్ధ వాతావరణం కనిపిస్తుండడంతో.. వాళ్లంతా కొట్టుకునిపోయి ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరదల్లో గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మృతదేహాల గుర్తింపు అధికారులకు మరో పెద్ద సవాల్గా మారింది. పోఖారా ఆస్పత్రికి గోర్ఖా, తనహున్, ధాదింగ్, నావల్పరాసీ ఈస్ట్ ప్రాంతాల నుంచి 102 మృతదేహాలను తరలించారు. వీరిలో 16 మందిని గుర్తించి కుటుంబాలకు అప్పగించారు. అయితే చాలా మృతదేహాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఫొటోలు, దుస్తులు, నగలు, టాటూల ఆధారంగా బాధితులను గుర్తించాల్సి వస్తోంది. అవసరమైన చోట డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారత్కు చెందిన 18 మంది ఫోరెన్సిక్ నిపుణులు కూడా గుర్తింపు ప్రక్రియలో సహకరిస్తున్నారు.
ホーム
/
Nepal Floods
/
నేపాల్ వరదలు : ఒకే ఇంట్లో 23 మృతదేహాలు లభ్యం : సవాల్గా మారిన మృతదేహాల గుర్తింపు
الثلاثاء، 1 سبتمبر 2026
23 Bodies Found in a Single House blocked tunnels have severely hampered relief efforts damaged roads Heavy rains Identification Poses a Challenge international mud Nepal Floods
ليست هناك تعليقات:
إرسال تعليق