ఊబకాయం చికిత్సలో ఉపయోగిస్తున్న ఆధునిక GLP-1 ఆధారిత మందులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా భారత్లోనూ సెమాగ్లుటైడ్, టిర్జెపాటైడ్ వంటి బరువు తగ్గించే మందుల వాడకం వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మందులపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, అలాగే వ్యాధి అవగాహన పేరుతో సాగుతున్న పరోక్ష ప్రకటనలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కఠిన చర్యలు ప్రారంభించింది. రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డ్రగ్ రెగ్యులేటరీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ మందులను కేవలం టైప్-2 మధుమేహం చికిత్స కోసం మరియు నిర్దిష్ట వైద్య ప్రమాణాలు ఉన్న రోగుల్లో దీర్ఘకాలిక బరువు నియంత్రణ కోసమే ఆమోదించినట్లు స్పష్టం చేశారు. ఈ మందులను సాధారణ బరువు తగ్గించే టానిక్లా ప్రచారం చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని కేంద్ర ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. ఇవి కేవలం నమోదిత వైద్యుల ప్రిస్క్రిప్షన్తో, ముఖ్యంగా ఎండోక్రినాలజిస్టులు లేదా అంతర్గత వైద్య నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలని పేర్కొంది. వైద్యుల సలహా లేకుండా వీటిని ఇష్టానుసారంగా వాడితే తీవ్రమైన దుష్ప్రభావాలు తలెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొన్ని ఫార్మా కంపెనీలు, వెల్నెస్ క్లినిక్లు, డిజిటల్ ప్లాట్ఫారమ్లు నేరుగా కాకుండా ఊబకాయం అవగాహన, హెల్త్ క్యాంపెయిన్ పేరుతో ప్రజల్లో ఆసక్తిని పెంచుతున్నట్లు ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని 2026 మార్చి 10న CDSCO ప్రత్యేక సలహా జారీ చేసింది. దీనిప్రకారం ప్రిస్క్రిప్షన్ మందుల ప్రత్యక్ష, పరోక్ష ప్రచారం, ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్లు, బ్రాండ్ మార్కెటింగ్లను పూర్తిగా నిషేధించారు. ప్రకటనలతో పాటు మందుల సరఫరా వ్యవస్థపైనా ప్రభుత్వం గట్టి నిఘా ఉంచింది. 2026 మార్చి 27న రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లకు పంపిన ఆదేశాల ద్వారా తయారీ నుంచి రిటైల్ విక్రయాలు, ఆన్లైన్ ఫార్మసీలు, వెల్నెస్ క్లినిక్ల వరకు మొత్తం సప్లై చెయిన్ను పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫార్మసీలు, హోల్సేల్ వ్యాపారులు, రిటైల్ షాపులు, వెయిట్ లాస్ క్లినిక్లు కలిపి మొత్తం 49 సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు, అవసరమైతే లైసెన్సులు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్లినికల్ పరీక్షల్లో ఈ మందులు బరువు తగ్గించడంలో మెరుగైన ఫలితాలు ఇచ్చినప్పటికీ, ఇవి ప్రతి ఒక్కరికీ సరిపోవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు మాత్రమే వైద్యుల సూచన మేరకు వాడాలి. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రిస్క్రిప్షన్ మందుల తప్పుడు ప్రచారాలను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతగానో దోహదపడతాయని, ప్రజలు కూడా స్వీయ వైద్యానికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
0 Comments