బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు చోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. వీటి ప్రభావం రాబోయే రోజుల్లో మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మర్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఒకటి,రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని సూచించింది.
0 Comments