Ad Code

మెడికో ప్రియాంక కన్నుమూత : కుటుంబానికి రూ.20 లక్షల ఆర్ధికసాయం ప్రకటించిన చంద్రబాబు : రెండు ప్రభుత్వాలపై మెడికో తండ్రి ఆవేదనపై ట్రోల్స్

మెడికో ప్రియాంక ఐదు రోజులు ఆసుపత్రిలో విగతజీవిగా మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయింది. రాజమండ్రిలో మెడికో ప్రియాంక డెత్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆమె స్కూటీని కారుతో ఢీకొట్టిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ కూడా జరుపుతున్నారు. ఇక బాధితురాలి కుటుంబానికి జరిగిన నష్టంపై ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్ధికసాయం ప్రకటించారు. అయితే మెడికో ప్రియాంక మృతిపై ఆమె తండ్రి వెంకటేష్ తమకు న్యాయం జరగలేదని, ఇంత జరిగితే సీఎం, డిప్యూటీ సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరూ పరామర్శించలేదని, కనీసం ఫోన్‌లో కూడా వివరాలు తెలుసుకోలేదని మీడియా సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ప్రియాంక తండ్రి తాను ఎవర్ని నిందించలేదని ఏపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని తీవ్ర బాధలో ఉన్న తమను అసత్య కథనాలతో మరింత బాధపెట్టవద్దని విన్నవించుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాజమండ్రిలో మెడికో ప్రియాంక కేసులో ఇంకా లోతుగా విచారణ జరుగుతోంది. నిందితులకు రిమాండ్ విధించి జైలుకు తరలించారు. మరోవైపు చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం ప్రియాంక చనిపోయింది. అయితే ప్రియాంక మృతదేహానికి సోమవారం గాంధీ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం కూడా పూర్తైంది. మృతదేహాన్ని స్వగ్రామమైన గద్వాల్ జిల్లా ఏక్లాన్పూర్‌కి తరలిస్తున్నారు. మృతురాలి కుటుంబానికి జరిగిన అన్యాయంపై, నిందితులపై ఏ విధమైన కఠిన చర్యలు తీసుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇలాంటి సమయంలో ఆమె తండ్రి వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ జరుగుతోంది. కూతురుని పోగొట్టుకున్న బాధలో తన కూతురు ఆసుపత్రిలో ఉంటే కనీసం పరామర్శించలేదంటూ మీడియా ఎదుట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మీ ఇంట్లో ఆడపిల్లకే ఇలా జరిగితే ఇంతే సైలెంట్‌గా ఉంటారా అని ప్రశ్నించడంతో సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. చనిపోయిన మెడికో జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన అమ్మాయి కావడంతో తెలంగాణ అనే వివక్ష చూపుతోంది ఏపీ సర్కారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇది మన రాష్ట్రంలో జరగలేదు కదా మనం ఎలా కలగచేసుకుంటామని చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉందని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలు, ప్రియాంక మరణం తర్వాత వెంకటేశ్ చేసిన కామెంట్స్‌కి వక్రీకరిస్తూ పెడుతున్న పోస్టులు, మీడియా కథనాలపై బాధితులు మరోసారి తమ ఆవేదనను వెళ్లబుచ్చారు. బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న తమపై ఇలాంటి అసత్య కథనాలు ఎందుకు ప్రసారం చేస్తున్నారని అంటున్నారు ప్రియాంక తండ్రి. ఏది ఏమైనప్పటికి ఈవిషయంలో వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేసిన తర్వాతే నిందితులపై సెక్షన్ 106 హత్యానేరం మోపారు. అలాగే ప్రియాంక మృతదేహం వెంట స్వయంగా ఏపీ మంత్రి టీజీ భరత్ ఏక్లాన్పూర్‌కి వెళ్తున్నారు. ఇటు తెలంగాణకు చెందిన మంత్రి వాకిటి శ్రీహరి కూడా వెళ్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల చెక్కును కూడా మృతురాలి తండ్రి వెంకటేశ్‌కి అందజేసినట్లుగా తెలుస్తోంది. బిడ్డను పోగొట్టుకున్న బాధలో ప్రియాంక తండ్రి మాటలను తప్పు పట్టకూడదని.. నిందితులపై కఠిన చర్యలు అంటే భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు ఎవరూ చేయకుండా ఉండేలా శిక్షించాలని ప్రజలు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu