ఆంధ్రప్రదేశ్ లోని తాడిపత్రి రైల్వే ట్రాక్ పక్కన హిజ్రా మల్లిక విగతజీవిగా పడి ఉండటాన్ని సోమవారం ఉదయం స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న తోటి హిజ్రాలు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. మల్లిక మృతదేహంతో మహాత్మా గాంధీ సర్కిల్‌కు చేరుకున్న హిజ్రాలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా పోలీసులకు, ట్రాన్స్‌జెండర్లకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. “గత పది రోజుల కిందే మా వర్గాల మధ్య ఆధిపత్యం కోసం గొడవలు జరుగుతున్నాయని, ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. కానీ పోలీసులు పట్టించుకోలేదు. ఆరోజు మా ఫిర్యాదు పట్టించుకుని ఉంటే ఈరోజు మా మల్లిక హత్యకు గురయ్యేది కాదు” అని బంధువులు, తోటి హిజ్రాలు ఆరోపించారు. పోలీసులు తమకు అన్యాయం చేశారని నినాదాలు చేశారు. తాడిపత్రి పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో “బధాయి” వసూలు, ప్రాంతాల పంపకం విషయంలో హిజ్రాల మధ్య రెండు వర్గాలుగా విడిపోయి గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోందని సమాచారం. ఇదే గొడవలు హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న తాడిపత్రి పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. “మల్లిక మృతి హత్యా, ఆత్మహత్యా, ప్రమాదమా అనేది పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక తెలుస్తుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని సీఐ ఆరోహన్ రావు తెలిపారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపామని, ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొంటానట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post