తెలుగు రాష్ట్రాల్లో పలు బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో కనిపిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఏపీలో ఇంధన కొరత పైన ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అదే సమయంలో తెలంగాణలోనూ కొరత ఉందంటూ వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఈ సమయంలో వీరికి ప్రభుత్వం కీలక సూచన చేసింది. తెలంగాణలో పెట్రోల్ కొరత ఉందంటూ హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు. పెట్రోల్ సమస్య పెరుగుతుందనే ఆందోళనతో పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. షేక్పేట్, గచ్చిబౌలి, మాదా పూర్, కూకట్పల్లితోపాటు పలు బం కులు వద్దకు పెద్ద సంఖ్యలో క్యూకట్టారు. కాగా, జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఓ బంకు సాయంత్రం 5గంటలకే మూతపడింది. అలాగే, బాలానగర్ మెట్రో స్టేషన్, చిత్తారమ్మ దేవాల యం సమీపాన బంకుల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. రైతులు పెద్ద ఎత్తున డీజిల్ కొనుగోళ్ల కోసం సమీప పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు. దీని పైన తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషన్ స్టీఫెన్ రవీంద్ర కీలక ప్రకటన చేసారు. తెలంగాణలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని.. పూర్తి నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పక్క రాష్ట్రంలో సమస్య కారణంగా సరిహద్దు జిల్లాల్లో కొనుగోళ్లు పెరిగాయని వివరించారు. అదే విధంగా పలు సమస్యల కారణంగా కొన్ని బంకులు మూసేసామని, సమస్య పరిష్కారం అయ్యాక తిరిగి తెరుస్తామని స్పష్టం చేసారు. ప్రజలు ఆందోళనతో బంకుల వద్ద క్యూ కట్టవద్దని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇంధన సరఫరాకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు లేదా అనుమానాలు ఉంటే వినియోగదారులు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1967ను సంప్రదించాలని అధికారులు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. వాహనదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు.
0 Comments