యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పరిపాలన పరంగా భారీ మార్పులు మొదలయ్యాయి. గత కొన్నేళ్లుగా ఒకే చోట తిష్టవేసి, ఆలయ యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకున్న అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉక్కుపాదం మోపింది. ఇందులో భాగంగానే దేవదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు తాజాగా సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. చాలా కాలంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న డి. భాస్కర్ శర్మను వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో పి. నవీన్ కుమార్ను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే, ఇది కేవలం సాధారణ బదిలీ మాత్రమే కాదని, దీని వెనుక పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణాలు ఆరోపణలు ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. యాదగిరిగుట్ట దేవస్థానంలో కొందరు అధికారులు దశాబ్ద కాలంగా పాతుకుపోయారు. రాజకీయ అండదండలతో, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో వీరు తమ సీట్లను కాపాడుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా భాస్కర్ శర్మ వంటి అధికారులు కారుణ్య నియామకం ద్వారా విధుల్లో చేరినప్పటికీ, రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని బదిలీలు కాకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో నవీన్ కుమార్ వంటి సీనియర్ అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు, వారికి కీలక బాధ్యతలు అప్పగించకుండా, కేవలం నామమాత్రపు సెక్షన్లకే పరిమితం చేసి, పాత అధికారులే పెత్తనం చెలాయించేవారని తెలుస్తోంది. తాజా ప్రభుత్వ నిర్ణయం ఈ 'రాజకీయ గుత్తాధిపత్యానికి' బ్రేక్ వేసినట్లయింది. ఆలయంలోని కొందరు అధికారులు భక్తుల సౌకర్యాల కంటే వీవీఐపీల సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ఇళ్లకు నేరుగా స్వామివారి ప్రసాదాలను, శేషవస్త్రాలను పంపడం ద్వారా తమ పలుకుబడిని పెంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ బదిలీ అయినా, డిప్యూటేషన్ పేరుతో కొద్ది రోజుల్లోనే తిరిగి యాదగిరిగుట్టకే చేరుకోవడం ఇక్కడి అధికారులకు అలవాటుగా మారింది. గతంలో వేములవాడ, కొమురవెల్లి వంటి ప్రాంతాలకు బదిలీ అయిన వారు రాజకీయ ఒత్తిళ్లతో మళ్లీ ఇక్కడికే వచ్చేవారు. తాజా బదిలీ వేటుతో ఆలయంలోని ఇతర విభాగాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సహాయ కార్యనిర్వహణ అధికారులు, పర్యవేక్షణ అధికారుల్లో భయం మొదలైంది. ప్రభుత్వం గనుక ప్రక్షాళన కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తే, ఆలయ పరిపాలనలో పారదర్శకత పెరుగుతుందని సామాన్య భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "స్వామివారి సన్నిధిలో రాజకీయాలకు తావుండకూడదు. అధికారులు భక్తులకు సేవ చేయాలి కానీ, నాయకుల చుట్టూ తిరగడం సరైంది కాదు. ఈ బదిలీలు మంచి పరిణామం" అని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు.
యాదాద్రి దేవస్థానం డిప్యూటీ ఈవోగా నవీన్ కుమార్ : దేవస్థానంలో పరిపాలన పరంగా భారీ మార్పులు మొదలు
الثلاثاء، 31 مارس 2026
Major Administrative Changes Underway Naveen Kumar Appointed as Deputy EO of Yadadri Temple Sri Lakshmi Narasimha Swamy Temple telangana
ليست هناك تعليقات:
إرسال تعليق