యూరోపియన్ యూనియన్, భారత్ మధ్య కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికా ప్రభుత్వం ఘాటైన విమర్శలు చేసింది. ఉక్రెయిన్ సంక్షోభం వేళ రష్యాపై కఠినంగా ఉంటామని చెబుతున్న యూరప్ దేశాలు మరోవైపు తన సొంత ప్రయోజనాల కోసం ఉక్రెయిన్ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ మండిపడ్డారు. ఈ వాణిజ్య ఒప్పందం యూరప్ దేశాల ద్వంద్వ నీతిని ఎండగడుతోందని ఆయన విమర్శించారు. అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ భారత్-ఈయూ ఒప్పందం తనను తీవ్రంగా నిరాశ పరిచిందని చెప్పారు. ఏ దేశమైనా తమ ఆర్థిక ప్రయోజనాల కోసం ఒప్పందాలు చేసుకోవచ్చని, అది వారి ఇష్టం అని అన్నారు. కానీ ఉక్రెయిన్ యుద్ధంలో ముందు వరుసలో ఉండి రష్యాను విమర్శిస్తున్న యూరప్ దేశాలు, ఇప్పుడు భారత్తో భారీ వాణిజ్య ఒప్పందం చేసుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ప్రజల ప్రాణాల కంటే యూరప్కు వ్యాపారమే ముఖ్యం అయిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురును కొనుగోలు చేస్తోందని బెస్సెంట్ తెలిపారు. ఆ చమురును భారత్ రిఫైన్ చేయగా వచ్చిన ఉత్పత్తులను.. యూరప్ దేశాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయని ఆరోపించారు. "భారత్ రష్యా చమురును కొంటోంది. యూరప్ ఆ రిఫైన్డ్ ఉత్పత్తులను కొంటోంది. అంటే పరోక్షంగా యూరప్ దేశాలే తమపై జరుగుతున్న యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయి. ఇది ఊహకు కూడా అందని విషయం" అని ఆయన విమర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా 25 శాతం అదనపు సుంకాన్ని విధించింది. అయితే యూరప్ మాత్రం అమెరికాతో కలిసి రావడానికి నిరాకరించింది. దీనికి కారణం భారత్తో ఈ భారీ వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసుకోవాలనే యూరప్ స్వార్థమేనని బెసెంట్ స్పష్టం చేశారు. "ఉక్రెయిన్ గురించి యూరోపియన్లు మాట్లాడే ప్రతిసారీ గుర్తుంచుకోండి.. వారు ఉక్రెయిన్ ప్రజల కంటే వాణిజ్యానికే పెద్దపీట వేశారు" అని ఆయన ఘాటుగా విమర్శించారు. యూరప్ దేశాలు ఇంధన అవసరాల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని, చౌకగా ఇంధనం దొరుకుతుందనే ఉద్దేశంతోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని బెసెంట్ విశ్లేషించారు. అమెరికా కూడా రష్యా నుంచి చమురు కొనాలనుకుంటే చౌకగా దొరుకుతుందని.. కానీ తాము నైతిక విలువలకు కట్టుబడి ఉన్నామని ఆయన గుర్తు చేశారు. కాగా భారత్-ఈయూ ఒప్పందాన్ని భారత్ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణిస్తుండగా.. అమెరికా మాత్రం దీనిని పశ్చిమ దేశాల ఐక్యతను దెబ్బతీసే చర్యగా చూస్తోంది.
ఉక్రెయిన్ ప్రజల ప్రాణాల కంటే యూరప్కు వ్యాపారమే ముఖ్యం : భారత్-ఈయూ ఒప్పందంపై అమెరికా విమర్శలు
الخميس، 29 يناير 2026
Europe prioritizes business over the lives of the Ukrainian people international US criticizes India-EU agreement US Treasury Secretary Scott Bessent
ليست هناك تعليقات:
إرسال تعليق