ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ పాఠశాలలో సైన్స్ టీచర్ ఎజాస్ అహ్మద్. యథావిధిగా బుధవారం పాఠశాల విధులకు హాజరయ్యారు. పాఠశాలలో ఓ చిన్న వివాదం రాజుకుంది. దీంతో కొందరు విద్యార్థులు పరస్పరం దాడి చేసుకున్నారు. దీనికి తోడు కొద్ది రోజుల కిందట పిల్లలను సరిగా నడుచుకోమని చెప్పడంతో ఉపాధ్యాయుడు ఎజాస్పై విద్యార్థులు ద్వేషం పెంచుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎజాస్పై ఒక్కసారిగా విద్యార్థులు విరుచుకుపడ్డారు. పక్కా ప్రణాళికగా టీచర్పై దాడికి పాల్పడ్డారు. పిడి గుద్దులతో దాడి చేసి వారి చేతిలో ఉన్న కడియంతో ఉపాధ్యాయుడు ఛాతీపైన కొట్టారు. దీంతో అక్కడికక్కడే ఎజాస్ కింద బోర్లాపడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఎవరూ స్పందించలేదని తెలుస్తోంది. ఎజాస్పై పిల్లల దాడి వెనుకాల తోటి ఉపాధ్యాయులే ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని మృతుడి భార్య ఆరోపించారు. ఉపాధ్యాయుడిని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకొని వెళ్లి చూడగా అప్పటికే ఉపాధ్యాయుడు మరణించాడు. ఉపాధ్యాయుడు భార్య రహిమూన్ కూడా రాయచోటిలోని బాలికల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. స్కూల్ నుంచి ఉపాధ్యాయులు ఫోన్ చేసి తన భర్తకు ఆరోగ్యం సరిగా లేదు ఆస్పత్రిలో చేరుస్తామని చెప్పారని భార్య వివరించారు. ఆస్పత్రికి వెళ్లి చూడగా అప్పటికే భర్త మృతి చెందడంతో ఆమె బోరున విలపించారు. పాఠశాలలో ఏం జరిగిందో తనకు అర్థం కావడం లేదని ఆమె వాపోయారు. తన భర్త మృతదేహంపై ఛాతీ, వీపు పై తీవ్ర గాయాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ విషయంపై డిప్యూటీ డీఈఓ గుండెపోటుతో చనిపోయాడని చెప్పడం హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తకు ఎలాంటి జబ్బులు లేవని పిల్లలు కొట్టడంతోనే తన భర్త చనిపోయారని ఉపాధ్యాయుడు భార్య రహిమున్ ఆరోపిస్తున్నారు.
0 Comments