తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సహకరించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లతో నింపే పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ను రేవంత్ రెడ్డి కోరారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నీటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనా ఈ పథకం కింద ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం. నల్లా లేని 7.85 లక్షల ఇళ్లతో పాటు పీఎంఏవై (అర్బన్), (రూరల్) కింద చేపట్టే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.16,100 కోట్ల వ్యయమవుతుందని తెలిపారు. ఈ ఏడాది నుంచి జల్జీవన్ మిషన్ నిధులు తెలంగాణకు కేటాయించాలని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన రేవంత్ రెడ్డి !
Telugu Lo Computer
0
Comments
Post a Comment