ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా బిఇడి, డిఎడ్ పూర్తి చేసుకున్న వారికి కూడా అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థులతో పాటు, వివిధ సంఘాల నుండి అందిన విజ్ఞఫ్తుల మేరకు ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ కోసం నిర్వహించాల్సిన మెగా డిఎస్సి, టెట్లను కొంతకాలం పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించనుంది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయమివ్వాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను అభ్యర్థులు, యువజన సంఘాల నేతలు, పలువురు ఎమ్మెల్సీలు కోరినట్లు అధికారవర్గాలు తెలిపాయి. వీరి విజ్ఞప్తి మేరకు పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులకు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. వాస్తవానికి టెట్ ప్రక్రియ బుధవారం నుంచి మొదలు కావాల్సి ఉంది. అయితే దీనిని 90 రోజులపాటు వాయిదా వేశారు. టెట్ ప్రక్రియ ముగిసిన తరువాత డిఎస్సి ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2025 జనవరి నాటికి మెగా డిఎస్సి పోస్టులను భర్తీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.
0 Comments