కర్ణాటకలోని బెలాగావిలో ఇంట్లో సోమవారం అర్ధరాత్రి రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెలాగావిలోని సెంట్రల్ బస్ స్టాండ్ సమీపంలోని చావత్ గల్లీలో ఈ ప్రమాదం జరిగింది. దామోనే కుటుంబం గణేష్ చతుర్థి వేడుకల కోసం తమ ఇంటిలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. రాత్రి భోజనం ముగించుకుని కుటుంబ సభ్యులందరూ ఎప్పట్లాగే నిద్రపోవడానికి వెళ్లారు. సోమవారం రాత్రి సుమారు 2:15 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. శబ్దం వచ్చిన వైపునకు వెళ్లి చూడగా, ఆ కుటుంబం ఉంటున్న రేకుల షెడ్డులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటల్లో చిక్కుకున్న గజానన్ దామోనే, రోషన్లను బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. అయితే, అప్పటికే తీవ్ర మంటలు వ్యాపించడంతో మిగతా నలుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గజానన్, రోషన్లను చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారికి సుమారు 60 శాతం కాలిన గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని భారతి దామోనే (50), శారద దామోనే (45), గంగ దామోనే (25), ప్రియ దామోనే (24)గా గుర్తించారు. మృతుల్లో శారద.. గజానన్ భార్య కాగా, భారతి దామోనే ఆయన సోదరి. ప్రియ, గంగలు వారి కుమార్తెలు కాగా, రోషన్ కుమారుడు. గజానన్ వడ్రంగిగా పని చేస్తుండగా, మిగతా కుటుంబ సభ్యులు ఇళ్లల్లో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రాథమిక విచారణలో రిఫ్రిజిరేటర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. అయితే ఫ్రిజ్ ఎందుకు పేలిందనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామన్నారు. గణేష్ విగ్రహం వద్ద అలంకరించిన విద్యుత్ దీపాల వల్ల షార్ట్ సర్క్యూట్ అయిందా? లేక వేరే కారణాల వల్ల ఈ పేలుడు సంభవించిందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
0 Comments