ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అధికారికంగా వెల్లడించారు. రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా విజయవంతం కావాలనే ఉద్దేశంతోనే మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. వివిధ వర్గాలు, ఉత్సవ కమిటీలు నిర్వహించే గణేష్ వేడుకలు ఘనంగా జరగాలని ఆకాంక్షిస్తూ, విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని లోకేష్ ప్రార్థించారు. పండుగ నిర్వహణకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందించే దిశగా ప్రభుత్వం ఈ చొరవ తీసుకుందని వివరించారు. మరోవైపు, ఉత్సవాల పర్యవేక్షణ, భద్రత కోసం పోలీసు శాఖ సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి మండపానికి చెందిన ఐదుగురు సభ్యుల కమిటీ వివరాలు, నిర్వాహకుల పేర్లు తదితర సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరిచి నిర్వాహకులకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ను కేటాయిస్తున్నారు.
0 Comments