మధ్యప్రదేశ్లోని చిత్రకూట్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘోర ఉదంతం సమాజాన్ని షాక్కు గురిచేస్తోంది. కట్నం వేధింపులతో పాటు, కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2023లో వివాహమైన బాధితురాలు వందన, పెళ్లైనప్పటి నుండి భర్త పెట్టే చిత్రహింసలను అనుభవిస్తోంది. బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం రూ. 2 లక్షల నగదుతో పాటు బంగారు గొలుసు తీసుకురావాలని భర్త నిత్యం తీవ్ర ఒత్తిడికి గురిచేసేవాడు. వృత్తిరీత్యా ట్రక్ డ్రైవర్ అయిన భర్త, తన తోటి డ్రైవర్లతో శారీరక సంబంధం పెట్టుకోవాలని, లేదా వ్యభిచారం చేసైనా సరే డబ్బులు సంపాదించి తీసుకురావాలని వేధించేవాడు. ప్రస్తుతం గర్భంతో ఉన్నప్పటికీ, కనికరం లేకుండా విచక్షణారహితంగా కొడుతూ, బూతులు తిడుతూ హింసించేవాడు. నిరాకరిస్తే మరింత దారుణంగా ప్రవర్తించేవాడు. భర్త వేధింపులు తాళలేక కన్నీటిపర్యంతమైన వందన, తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేస్తూ తీవ్రంగా స్పందించింది. నన్ను నీ దగ్గర ఉంచుకోవాలనుకుంటే గౌరవంగా ఉంచు, లేదంటే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పేయ్. నా బిడ్డ, నా భవిష్యత్తుకు సంబంధించిన లెక్క తేల్చేయ్ అంటూ బాధితురాలు వందన ఓ వీడియో రిలీజ్ చేసింది. గర్భంతో ఉన్న మహిళపై జరిగిన ఈ దారుణంపై స్థానికులు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
0 Comments