బెంగళూరులో తండ్రీకొడుకులు అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త, ఐదేళ్ల చిన్నారిని భార్యే స్వయంగా దిండుతో ఊపిరాడకుండా చేసి హతమార్చినట్లు పోలీసులు తేల్చారు. ఈ దారుణానికి పాల్పడిన మహిళను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితురాలు హరిణి, ఆమె భర్త అభినందన్, ఐదేళ్ల కుమారుడు కలిసి నివసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ కుటుంబం బంధువులను కలిసి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత అభినందన్, హరిణి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవ అనంతరం ఇద్దరూ వేర్వేరు గదుల్లో పడుకున్నారు. సోమవారం ఉదయం తన భర్త, కుమారుడు స్పందించడం లేదంటూ హరిణే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అభినందన్ శరీరంపై ఎలాంటి కత్తిపోట్లు లేనప్పటికీ, కొన్ని చోట్ల గాయాల ఆనవాళ్లు, చెవుల నుంచి రక్తం కారడం గమనించారు. దీంతో సహజ మరణం కాదని అనుమానించిన పోలీసులు, వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని హరిణిని అదుపులోకి తీసుకున్నారు. మొదట విచారణకు సహకరించని ఆమె, పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు నిజం ఒప్పుకుంది. గొడవ కారణంగానే తాను భర్తను, కొడుకును ఊపిరాడకుండా చేసి చంపినట్లు అంగీకరించింది. మరోవైపు, ఆ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కెమెరాలు వాటంతట అవే ఆగిపోయాయా లేదా ఎవరైనా కావాలనే ఆపేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఏమైనా ఫుటేజ్ డిలీట్ చేశారా అనే దానిపై సాంకేతిక నిపుణుల సహాయంతో ఆరా తీస్తున్నారు.
0 Comments