Ad Code

ఎస్ఐఆర్‌ ప్రక్రియ పేరుతో కుట్రలు జరుగుతున్నాయి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్‌ ప్రక్రియ పేరుతో కుట్రలు జరుగుతున్నాయని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బెంగాల్ తర్వాత తెలంగాణే టార్గెట్ అని కొందరు చెబుతున్నారని, రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు తొలగించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓట్ల తొలగింపు కోసం జరుగుతున్న కుట్రలు ఫలించకూడదని అన్నారు. హైదరాబాద్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్లో సీఎం పాల్గొని మాట్లాడారు. రాబోయే పది రోజుల పాటు ప్రతి పోలింగ్ బూత్‌లోని కార్యకర్త ఒక్కో రేవంత్ రెడ్డిలా పనిచేయాలని సూచించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, గుజరాత్ నుంచి వస్తున్న వారిని అడ్డుకునేందుకు అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఓటర్ల పేర్లు నమోదు చేసే సమయంలో చిన్నపాటి పొరపాట్లు కూడా జరగకుండా చూడాలని సీఎం సూచించారు. చిన్న తప్పిదాల కారణంగా అర్హులైన వ్యక్తుల ఓట్లు తొలగిపోయే పరిస్థితి రాకూడదన్నారు. బీఎల్ఓల పనితీరు ఎలా ఉన్నా, పార్టీ కార్యకర్తలు బీఎల్ఏలుగా బాధ్యత తీసుకుని అర్హులైన ప్రతి ఓటు జాబితాలో ఉండేలా చూడాలని కోరారు. ముస్లిం మైనారిటీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని రద్దు చేయించేందుకు ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు అత్యున్నత న్యాయస్థానాల వరకు వెళ్లాయని, అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వాటిని అమలు చేసిందని చెప్పారు. మైనారిటీల ప్రతిభా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన పలువురు మైనారిటీ ప్రతినిధులకు అవార్డులు అందజేశారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నారని సీఎం ఆరోపించారు. సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్‌ను సెక్యులర్ పార్టీగా అభివర్ణిస్తూ హిందువులు, ముస్లింలను రెండు కళ్లలా చూస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షలు, నియామకాలను సక్రమంగా నిర్వహించలేకపోయిందని ఆరోపించారు. టీజీపీఎస్సీలో ఒక ఆర్‌ఎంపీ వైద్యుడిని సభ్యుడిగా నియమించారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో గ్రూప్-1 నియామకాలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, ఒకసారి నియామక ప్రక్రియ చేపట్టినా ప్రశ్నపత్రాలు పల్లి, బఠానీల్లా అమ్మారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి విద్యావంతులను నియమించామని సీఎం తెలిపారు. టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్-1 పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. గ్రూప్-1 నియామకాలను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు సుప్రీంకోర్టు వరకు వెళ్లారని, తమ ప్రభుత్వం తరఫున సమర్థుడైన న్యాయవాదిని నియమించి వాదనలు వినిపించడంతో నియామకాలను పూర్తిచేయగలిగామని వివరించారు. అదేవిధంగా గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టుల భర్తీ విషయంలోనూ కోర్టుల్లో న్యాయపోరాటం చేసి ఉద్యోగ నియామకాలను పూర్తి చేశామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu