మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యింది. 500 కిలోమీటర్లకుపైగా రేంజ్ ఇచ్చే సరికొత్త 7 సీటర్ ఎలక్ట్రిక్ కారును తీర్చిదిద్దుతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు, పెద్ద కుటుంబాలు ఎంచక్కా సుదీర్ఘ ప్రయాణాలు చేసేలా డిజైన్ చేస్తున్నారు. పెట్రోల్, సీఎన్జీ విభాగాల్లో అల్టిమేట్ ఆధిపత్యం చెలాయిస్తున్న మారుతి సుజుకి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలోనూ తనే టాప్ అనిపించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఈ-విటారా మోడల్తో సందడి చేస్తున్న సంస్థ, తదుపరి అడుగుగా పెద్ద కుటుంబాల కోసం భారీ 7 సీటర్ ఈవీ తీసుకొస్తోంది. వైఎమ్సీ (YMC) కోడ్నేమ్తో రూపొందుతున్న ఈ కారు, మార్కెట్లోకి వస్తే ప్రత్యర్థులంతా పక్కకు తప్పుకోవాల్సిందే అన్నంత రేంజ్లో హల్చల్ సృష్టిస్తోంది. ఇప్పటికే అర్టిగా మోడల్తో ఫ్యామిలీ కార్ల విభాగంలో చెరిగిపోని ముద్ర వేసిన మారుతి, ఈ ఎలక్ట్రిక్ వర్షన్తో మరింత మంది వాహనదారులను కవర్ చేసేలా ప్లాన్ వేసింది. ఈ కొత్త 7 సీటర్ ఎలక్ట్రిక్ కారును 'హార్ట్టెక్-ఈ' ప్లాట్ఫారమ్పై ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. ఇందులో రోజువారీ ప్రయాణాల కోసం 49 కిలోవాట్ అవర్ బ్యాటరీ, సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారి కోసం 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ అనే రెండు ఆప్షన్లను ఇచ్చే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీని ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్లకుపైగా సునాయాసంగా ప్రయాణించవచ్చు. దీనివల్ల దూరప్రాంత ప్రయాణాల్లో చార్జింగ్ స్టేషన్ల గురించిన భయాలు పూర్తిగా తొలగిపోతాయి. డిసి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కేవలం 45 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. కారు లోపల కాలు మోపగానే ప్రీమియం ఫీలింగ్ కలిగేలా మారుతి డిజైన్ చేస్తోంది. పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, గ్లాస్ రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయాలు ఆకట్టుకుంటాయి. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ ప్రయాణాన్ని మరింత సుఖవంతంగా మారుస్తాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఏకంగా 7 ఎయిర్బ్యాగ్లు, 360 డిగ్రీల కెమెరా, లెవెల్-2 అడాస్ సాంకేతికత అందిస్తున్నారు. గుజరాత్లోని అత్యాధునిక ప్లాంట్ లోనే ఈ కార్ల తయారీ జరగనుండటంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి కానున్నాయి.
0 Comments