అత్యవసర, అత్యంత హింసాత్మక పరిస్థితుల్లో పోలీసులు పెల్లెట్ గన్స్ను ఉపయోగించడంలో తప్పేం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే పెల్లెట్ గన్స్ను పూర్తిగా బ్యాన్ చేయాలన్న డిమాండ్ను కోర్టు అంగీకరించలేదు. బదులుగా, అసాధారణ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాటి వినియోగం సమంజసమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే జూలై 20న జంతర్మంతర్లో విధుల్లో ఉన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉపయోగించిన మందుగుండు సామగ్రికి సంబంధించిన పూర్తి రికార్డును భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో నిరసనల్లో గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. పెల్లెట్ గన్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని మాజీ ఐపీఎస్ అధికారి యశోవర్ధన్ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. నిరసనలు హింసాత్మకంగా మారి, దుండగులు చొరబడి పరిస్థితి అదుపు తప్పినప్పుడు పోలీసులు చట్టబద్ధంగా బలప్రయోగం చేయాల్సి వస్తుందని పేర్కొంది. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వంటి చర్యలు ఫలించకపోతే, అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో పోలీసులు బుల్లెట్లను కూడా ఉపయోగించేందుకు చట్టం అవకాశం ఇస్తుందని.. అలాంటప్పుడు ప్రాణాంతకం కాని (Non-lethal) పెల్లెట్ గన్స్ను పూర్తిగా నిషేధించాలని ఎలా చెప్పగలమని ధర్మాసనం ప్రశ్నించింది. అదే సమయంలో.. వాటి వినియోగంపై స్పష్టమైన ప్రోటోకాల్ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయమూ వ్యక్తం చేసింది. నిరసనల సమయంలో ఎవరైనా గాయపడితే వారికి తక్షణమే నాణ్యమైన వైద్య చికిత్స అందించడం ప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జంతర్ మంతర్ ఘటనలో గాయపడిన నిరసనకారులందరికీ అవసరమైన వైద్య సేవలు అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ホーム
/
Supreme Court
/
అత్యవసర, అత్యంత హింసాత్మక పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ను ఉపయోగించడంలో తప్పేం లేదు : సుప్రీంకోర్టు
الخميس، 30 يوليو 2026
Chief Justice Surya Kant highly violent situations Justice Joymalya Bagchi Justice V. Mohana national No harm in using pellet guns during emergency Supreme Court
ليست هناك تعليقات:
إرسال تعليق