జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యుషూలోని కుమమోటో ప్రిఫెక్చర్లో మంగళవారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం కారణంగా పలువురు గాయపడగా, ఒక భవనం కూలిపోయినట్లు ప్రధానమంత్రి సనాయే తకైచి తెలిపారు.భూకంపం అనంతరం గరిష్ఠంగా ఒక మీటర్ ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు వెంటనే సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఒక మీటర్ ఎత్తులో అలలు నమోదైనట్లు జాతీయ ప్రసార సంస్థ ఎన్హెచ్కే వెల్లడించింది. నష్టంపై వెంటనే సమగ్ర సమాచారం సేకరించాలని, ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సహాయక చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులను ఆదేశించింది. భూకంపం ప్రభావంతో అణు విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి అసాధారణ పరిస్థితులు తలెత్తలేదని జపాన్ అణు నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. కుమమోటోతో పాటు నాగసాకి, కగోషిమా, ఫుకుఒకా, సాగ, ఓయిటా, మియాజాకి ప్రిఫెక్చర్లకు అత్యవసర భూకంప హెచ్చరికలు జారీ చేశారు.జపాన్ ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటంతో అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
0 Comments