కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖల కేటాయింపులో తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీనియర్ మంత్రి రామలింగారెడ్డి తన పదవికి శుక్రవారం అకస్మాత్తుగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. దీంతో అలర్ట్ అయిన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అర్ధరాత్రి రంగంలోకి దిగి సంక్షోభాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. తనకు కేటాయించిన 'నీటిపారుదల శాఖ' (ఇరిగేషన్) పట్ల రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. "నాకు కేటాయించిన శాఖతో నేను అస్సలు సంతృప్తిగా లేను. నా ఆత్మసాక్షికి వ్యతిరేకంగా నేను పని చేయలేను" అని స్పష్టం చేస్తూ ఆయన తన మంత్రి పదవికి శుక్రవారం రాజీనామా సమర్పించారు. సీనియర్ నేత ఇలా ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంత్రి రాజీనామా వార్త తెలియగానే డీకే శివకుమార్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. జయనగర్లోని ఒక ప్రైవేట్ హోటల్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రామలింగారెడ్డితో డీకే శివకుమార్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ కీలక చర్చల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు సైతం పాల్గొన్నారు. దాదాపు గంటల తరబడి సాగిన ఈ బుజ్జగింపుల పర్వం ఎట్టకేలకు ఫలించింది. రామలింగారెడ్డితో చర్చల అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. "శాఖల కేటాయింపులపై ఇద్దరం కూర్చుని వివరంగా మాట్లాడుకున్నాం. ప్రస్తుతం సమస్య సద్దుమణిగింది. నీటిపారుదల శాఖ కేటాయించడంపైనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు, దీనిపై ఒక సానుకూల నిర్ణయానికి వచ్చాం. మేము ఇద్దరం 1980ల నుంచే మంచి స్నేహితులం. మా ప్రభుత్వం చాలా ఐక్యంగా ఉంది, అలాగే ముందుకు సాగుతుంది" అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోని సీనియర్ నేతలందరికీ మంచి అవకాశాలు కల్పించామని, చిన్నచిన్న అభిప్రాయ భేదాలు ఉంటే త్వరలోనే సర్దుబాటు చేస్తామని పేర్కొన్నారు.
కేటాయించిన శాఖపై రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి : సీఎం డీకే శివకుమార్ బుజ్జగింపుతో సద్దుమణిగిన వివాదం
السبت، 6 يونيو 2026
Dispute Resolved After DK Shivakumar's Intervention karnataka Ramalinga Reddy Expresses Strong Dissatisfaction Over Allocated Portfolio
ليست هناك تعليقات:
إرسال تعليق