తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో భారీ వర్షాల సూచనల నేపథ్యంలో పోలీసు శాఖ ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలకు ప్రత్యేక సూచనలు ఇచ్చింది.కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మెదక్, నిర్మల్, ములుగు, నిజామాబాద్, సిద్దిపేట, పెద్దపల్లి, సూర్యాపేట, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కరీంనగర్, నల్గొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. నేడు మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం నాడు నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రైతులు పంటలను సరైన సమయంలో రక్షించుకోవాలని సలహా ఇచ్చింది. ఈ వర్షాలు రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఉపయోగపడే అవకాశం ఉంది.
0 Comments