ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా భీమిలి పరిధిలోని వలందపేట గ్రామంలో ఓ మహిళ తన భర్తను హత్య చేసి, ఆ తరువాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మొదట కుటుంబ సభ్యులు, పొరుగువారిని తప్పుదారి పట్టించిన ఆమె, చివరకు పోలీసుల విచారణలో నిజం ఒప్పుకుంది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భీమిలి ఎస్ఐ సురేశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వలందపేట గ్రామానికి చెందిన బోర సూరిబాబు అలియాస్ తాత (28) తాపీమేస్త్రిగా పని చేసేవాడు. అతనికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగమణి (26)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. నాగమణి స్థానికంగా ఉన్న ఓ న్యూడిల్స్ దుకాణంలో పని చేస్తోంది. అయితే వివాహం జరిగిన కొంతకాలం నుంచే వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా భర్త సూరిబాబు తరచూ మద్యం సేవించి ఇంటికి రావడం, భార్యపై అనుమానాలు వ్యక్తం చేయడం కారణంగా కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. పెళ్లయి ఎనిమిదేళ్లు అయినప్పటికీ వీరికి సంతానం లేకపోవడం కూడా కుటుంబ కలహాలకు మరో కారణంగా మారినట్లు తెలుస్తోంది. భర్త వేధింపులు భరించలేక నాగమణి ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యుల జోక్యంతో ఇటీవలే ఇద్దరూ మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు. కానీ పాత విభేదాలు మళ్లీ బయటపడటంతో తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం సూరిబాబు మద్యం సేవించి ఇంటికి రావడంతో మరోసారి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తురాలైన నాగమణి చున్నీతో భర్త గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన అనంతరం ఆమె చాకచక్యంగా దాన్ని ఆత్మహత్యగా చూపించే ప్రయత్నం చేసింది. "ఏదో విషం తాగేసి పడిపోయాడు.. లేవడం లేదు" అంటూ పొరుగువారిని నమ్మించి, సంగివలసలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే సూరిబాబు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సూరిబాబు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఇది సాధారణ మరణం కాదని, నాగమణే హత్య చేసి ఉండొచ్చని భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పరిశోధించారు. మొదట నాగమణి పొంతనలేని సమాధానాలు చెప్పినప్పటికీ, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చివరకు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని నగరంలోని మహిళా హోంకు తరలించారు. భీమిలి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పంచనామా నిర్వహించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
చున్నీతో భర్త గొంతు బిగించి హత్య చేసిన భార్య !
الثلاثاء، 26 مايو 2026
Andhra Pradesh crime located within the Bheemili limits of Visakhapatnam district Valandapeta village Wife Murders Husband by Strangling Him with a Scarf
ليست هناك تعليقات:
إرسال تعليق