నటి ట్విషా శర్మ మృతి కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. ఆ రాష్ట్ర హోమ్ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన పంపింది. ఈ పరిణామంతో ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని, మృతురాలి కుటుంబానికి న్యాయం లభిస్తుందని ఆశలు బలపడ్డాయి. ట్విషా శర్మ తండ్రి నవనిధి శర్మ రెండు రోజుల కిందటే రిటైర్డ్ సైనికులతో కలిసి ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ను కలిశారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ట్విషా శర్మ కేసులో దోషులకు శిక్ష పడాలంటే సీబీఐతో విచారణ ఒక్కటే మార్గమని, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది. బాధితురాలి కుటుంబం సీబీఐ విచారణతో పాటు ఆమె మృతదేహానికి రెండోసారి పోస్ట్మార్టం చేయాలని పదే పదే డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగట్లేదని ట్విషా శర్మ కుటుంబం అభిప్రాయపడుతోంది. అరెస్ట్ అయిన అతి కొద్దిరోజుల్లోనే ఆమె అత్తకు బెయిల్ లభించడం పట్ల పలు సందేహాలు సైతం వ్యక్తం చేసింది. దీంతో బెయిల్ వచ్చిన రోజే నవనిధి శర్మ.. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ను కలిశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో దర్యాప్తు వేగవంతమౌతుందని ఆమె కుటుంబం ఆశిస్తోంది. ఆత్మహత్య మిస్టరీని సీబీఐ ఛేదిస్తుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్విషా శర్మ కుటుంబ న్యాయవాది ఆయుష్ తివారీ కోర్టులో వాదనల సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. ట్విషా శర్మ, ఆమె అత్త గిరిబాలా సింగ్ మధ్య జరిగిన వాట్సప్ చాట్లను ఆయన ఉదహరించారు. తన అత్తగారింట్లో ట్విషా శర్మ నిరంతరం మానసిక, శారీరక వేధింపులకు గురైందనే విషయం ఈ వాట్సప్ చాట్ ద్వారా స్పష్టంగా తెలుస్తోందని, అత్తింటివాళ్లు ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆయుష్ తివారీ పేర్కొన్నారు. ఆమె మరణం వెనుక ఉన్న అసలు నిజాన్ని వెలికితీయడానికి, ట్విషా శర్మ కుటుంబం ఆమె మృతదేహానికి తిరిగి పోస్ట్మార్టం నిర్వహించాలని కోర్టులో ప్రత్యేకంగా పిటీషన్ దాఖలు చేయనుంది. కేసులో నిందితుడైన ట్విషా భర్త సమర్థ్ సింగ్ ముందస్తు బెయిల్ను కోర్టులో వ్యతిరేకిస్తామని న్యాయవాది తెలిపారు. ట్విషా గిరిబాలా సింగ్కు లభించిన ముందస్తు బెయిల్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే గిరిబాలా సింగ్కు హడావుడిగా ముందస్తు బెయిల్ మంజూరు కావడాన్ని న్యాయవాది ఆయుష్ తివారీ ప్రశ్నించారు. ఇంత త్వరగా, హడావుడిగా ముందస్తు బెయిల్ లభించడం బట్టి గిరిబాలా సింగ్ తన అధికారం, పలుకుబడిని పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు.
ట్విషా శర్మ మృతి కేసు : సీబీఐ విచారణకు సిఫారసు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
الجمعة، 22 مايو 2026
accompanied by a group of retired soldiers cinema met with CM Dr. Mohan Yadav national Navanidhi Sharma Sharma's father Twisha Sharma Death Case: Madhya Pradesh Government Recommends CBI Inquiry
ليست هناك تعليقات:
إرسال تعليق