పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలు ప్రాణనష్టానికి దారితీశాయి. ఎన్నికల అనంతర హింసలో ఇద్దరు రాజకీయ కార్యకర్తలు దారుణంగా హత్యకు గురయ్యారు. హౌరా జిల్లాలో బీజేపీ కార్యకర్త జాదవ్ బార్ హత్యకు గురయ్యాడు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. బీర్భూమ్ జిల్లాలో టీఎంసీ కార్యకర్త అబీర్ షేక్ ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య వెనుక బీజేపీ మద్దతుదారులు ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జల్పాయ్గురి నియోజకవర్గంలో కూడా ఉద్రిక్తత నెలకొంది. టీఎంసీ అభ్యర్థి కృష్ణదాస్, బీజేపీ మద్దతుదారులపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పలు చోట్ల ఇళ్లపై దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్న నేపథ్యంలో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ, మరిన్ని అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశారు.
Post a Comment