ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ బార్ అసోసియేషన్ 2026 సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోటేశ్వర్ సింగ్ మాట్లాడుతూ భారతదేశం ఎప్పుడూ తనను హిందూ దేశంగా ప్రకటించుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఏ ధర్మాధికారి సహా పలువురు న్యాయవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయ విద్య, రాజ్యాంగ విలువలు, భారత న్యాయవ్యవస్థ దిశపై ఆయన విస్తృతంగా మాట్లాడారు. జస్టిస్ కోటేశ్వర్ సింగ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశాన్ని స్పష్టంగా ఒక లౌకిక దేశంగా నిర్వచించిందని చెప్పారు. ఏ ఒక్క మతంతో దేశాన్ని గుర్తించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. భారతదేశం అనేక మతాలు, సంస్కృతులు కలిసి జీవించే ప్రత్యేక దేశం. అందుకే దీనిని ఒకే మతంతో పరిమితం చేయలేం" అని ఆయన వ్యాఖ్యానించారు. 'హిందూ' అనే పదానికి ప్రత్యేక మతపరమైన నిర్వచనం కంటే చారిత్రక, భౌగోళిక అర్థమే ఎక్కువగా ఉందని జస్టిస్ సింగ్ వివరించారు. "సింధు నది అవతల నివసించే ప్రజలను సూచించడానికి ఈ పదం వాడుకలోకి వచ్చింది. భారతదేశం తనను ఎప్పుడూ 'హిందూ దేశం'గా ప్రకటించుకోలేదు" అని ఆయన స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం కేవలం న్యాయపరమైన పుస్తకం మాత్రమే కాకుండా, దేశ స్వాతంత్య్ర పోరాట ఆశయాలను ప్రతిబింబించే జీవంతమైన పత్రం అని ఆయన అన్నారు. ఇది చరిత్ర, సమాజం, సృజనాత్మకత కలిసిన ఒక మార్గదర్శక గ్రంథమని, కాలానుగుణంగా మార్పులకు అనుగుణంగా పనిచేసే శక్తి దీనికి ఉందని వివరించారు. భారత న్యాయవ్యవస్థపై పాశ్చాత్య ప్రభావాన్ని పూర్తిగా అనుసరించడం సరైనది కాదని ఆయన సూచించారు. "పాశ్చాత్య న్యాయ విధానాలు భారతీయ సామాజిక వాస్తవాలను పూర్తిగా ప్రతిబింబించలేవు. మన న్యాయవ్యవస్థ మన అవసరాలకు అనుగుణంగా ఉండాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థలో ప్రాంతీయ భాషల వినియోగాన్ని పెంచాల్సిన అవసరాన్ని జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంక్లిష్ట న్యాయ పదజాలం, ఇంగ్లీష్ ఆధిపత్యం కారణంగా సాధారణ ప్రజలు న్యాయ వ్యవస్థను సులభంగా అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రాంతీయ భాషల్లో వాదనలు, తీర్పులు అందుబాటులో ఉంటే ప్రజలకు న్యాయం మరింత చేరువ అవుతుందని ఆయన పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ లక్ష్యం కేవలం తీర్పులు ఇవ్వడం మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడికి న్యాయం అందేలా చేయడమని ఆయన స్పష్టం చేశారు. అందుకోసం భాష, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు వంటి అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉందని సూచించారు. అలానే విద్యార్థులను ఉద్దేశించి జస్టిస్ కోటేశ్వర్ సింగ్ మాట్లాడుతూ న్యాయ విద్యను కేవలం ఉద్యోగ అవకాశంగా కాకుండా, సమాజానికి సేవ చేసే సాధనంగా చూడాలని సూచించారు. న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువలను కాపాడడం ప్రతి న్యాయవేత్త బాధ్యత అని ఆయన అన్నారు.

Post a Comment

Previous Post Next Post