విజయవాడలో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన "ఉద్యమి టు ఉన్నతి" ఎగ్జిబిషన్-2026 సందర్శించిన సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల ప్రతిభను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి మార్కెట్ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో వివిధ రంగాలకు చెందిన మహిళా వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. అరకు ఆర్గానిక్ మిల్లెట్స్ నుంచి చేనేత వస్త్రాలు, హస్తకళల వరకు విభిన్న ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి. అలాగే ఈవీ ఛార్జింగ్ వంటి సాంకేతిక ఆధారిత స్టాళ్లు కూడా ప్రత్యేకంగా నిలిచాయి. మంత్రి దుర్గేష్ ప్రతి స్టాల్ను సందర్శించి, ఉత్పత్తుల తయారీ విధానం, మార్కెటింగ్ అవకాశాలపై ఆరా తీశారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి చూపిస్తున్న పట్టుదల ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్నతరహా పరిశ్రమలను పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, బీ2బీ, బీ2సీ మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు విస్తృత అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను పారిశ్రామిక రంగంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పలు పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం మేరకు రాష్ట్రంలో "ప్రతి ఇంటికొక పారిశ్రామికవేత్త" అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. "వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్" కార్యక్రమం ద్వారా లక్షలాది మహిళలను స్వయం ఉపాధి వైపు దారి తీస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం పెంపొందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి దుర్గేష్ భరోసా ఇచ్చారు. పారిశ్రామిక పార్కుల ఏర్పాటుతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు అవసరమైన శిక్షణ, ఫైనాన్స్, మార్కెటింగ్ మద్దతు అందించడంలో ప్రభుత్వం ముందుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహిళా పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, విజయగాథలను తెలుసుకుని సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా మెప్మా, డ్వాక్రా మహిళల భాగస్వామ్యం, టెక్నాలజీ వినియోగం ఆయనను ఆకట్టుకున్నాయి. మహిళలు డిజిటల్ ప్లాట్ఫార్మ్లను ఉపయోగించుకుని తమ ఉత్పత్తులను విస్తృత మార్కెట్కు తీసుకెళ్తున్నారని అభినందించారు. మొత్తంగా "ఉద్యమి టు ఉన్నతి" ఎగ్జిబిషన్ మహిళా సాధికారతకు ఒక వేదికగా నిలిచిందని మంత్రి అభిప్రాయపడ్డారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళా శక్తిని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
ホーム
/
VIJAYAWADA
/
మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది : మంత్రి కందుల దుర్గేష్
الأربعاء، 25 مارس 2026
"Udyami to Unnati" 2026 Andhra Pradesh El gobierno de coalición prioriza el empoderamiento de la mujer Ministro Kandula Durgesh VIJAYAWADA
ليست هناك تعليقات:
إرسال تعليق