అండమాన్, పోర్ట్ బ్లెయిర్ లోని శ్రీ విజయపురం ఎయిర్ పోర్ట్ నుండి మాయాబుందర్ కు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తి బంగాళాఖాతంలో పడింది. ఈ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పైలెట్లు సముద్ర జలాల మీద క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా అందరు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పవన్ హన్స్ ప్రతినిధి స్పష్టం చేశారు. 24 గంటల వ్యవధిలో ఇది రెండో ప్రమాదం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిన్న సాయంత్రం జార్ఖండ్లోని చత్రాలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుమంది ప్రాణాలు కోల్పోయారు. రెడ్బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ నడుపుతున్న బీచ్క్రాఫ్ట్ సీ90 ఎయిర్ అంబులెన్స్, రాంచి నుంచి ఢిల్లీకి వైద్య సహాయక విమానంగా వెళ్తుండగా సోమవారం సాయంత్రం కూలిపోయింది. ఈ క్రాష్ ల్యాండింగ్ సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు శరవేగంగా స్పందించారు. హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పోలీస్ మెరైన్ ఫోర్స్ పడవలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పాక్షికంగా మునిగిన హెలికాప్టర్ వద్దకు చేరుకున్నాయి. ఆందోళనలో ఉన్న అయిదుమంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లను సురక్షితంగా బయటకు తీశారు. వారందరూ కూడా షాక్ లో కనిపించారు. వారికి ఎటువంటి గాయాలు కాలేదు. పైలట్లు ఈ క్రాష్ ల్యాండింగ్ ను అద్భుతంగా నిర్వహించారని పవన్ హన్స్ తెలిపింది. వారి సమయస్ఫూర్తిని ప్రశంసించింది. హెలికాప్టర్ను సముద్రంలో క్రాష్ కాకుండా సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారని, వారి అప్రమత్తత.. అయిదుమంది ప్రాణాలను కాపాడాయని తెలిపింది. ఖాళీ చేసిన వెంటనే హెలికాప్టర్లోని వారందరినీ మాయాబుందర్లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు షాక్ లో ఉన్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
బంగాళాఖాతంలో క్రాష్ ల్యాండింగ్ అయిన హెలికాప్టర్
الثلاثاء، 24 فبراير 2026
Helicopter crash lands in Bay of Bengal national Sri Vijayapuram Airport in Andaman Port Blair to Mayabundar technical problems
ليست هناك تعليقات:
إرسال تعليق