చంద్రుడిపై 'సెల్ఫ్ గ్రోయింగ్ సిటీ' నిర్మిస్తాం : 'ఎక్స్'లో పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్


వచ్చే పదేళ్లలో చంద్రుడిపై 'సెల్ఫ్ గ్రోయింగ్ సిటీ' నిర్మించాలనే ప్రణాళిక ఉందని క్స్, టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్‌మస్క్ ఇటీవల వెల్లడించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.ఈ పోస్టును 4 కోట్ల మందికి పైగా చూశారు. మార్స్‌పై నగరం నిర్మించే లక్ష్యాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి, ఇప్పుడు చంద్రుడిపై దృష్టి సారిస్తున్నామని 'స్పేస్‌ ఎక్స్' ప్రకటించింది. చంద్రుడిపై నగరాభివృద్ధి ఆలోచనను ఎక్స్‌లో పంచుకున్న మస్క్, ఆ నగర ఎలా నిర్మిస్తారనే బ్లూప్రింట్‌ను వెల్లడించలేదు. అయితే చంద్రుడిపై లభించే వనరులనే ఉపయోగించుకుంటూ క్రమంగా శాశ్వత మానవ నివాసాలు విస్తరించేలా చేయాలని యోచిస్తున్నట్టు మస్క్ చెప్పారు. 'ఈ లక్ష్యాన్ని పదేళ్లలోపు సాధించవచ్చు. కానీ ఇదే పని అంగారకుడిపై అయితే 20 ఏళ్లకంటే ఎక్కువ పడుతుంది' అని మస్క్ వెల్లడించారు. 'మనిషి చైతన్యాన్ని, జీవితాన్ని నక్షత్రాల వరకు విస్తరింపచేయడం' అనే స్పేస్ ఎక్స్ లక్ష్యంలో మార్పు లేదని మస్క్ తెలిపారు. సౌరవ్యవస్థలో గ్రహాలన్నీ ఒకే రేఖలోకి వచ్చే సమయంలో మాత్రమే మార్స్‌పైకి ప్రయాణం సాధ్యమవుతుంది. ఇది ప్రతి 26 నెలలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. పైగా, ఆ ప్రయాణానికి ఆరు నెలలు పడుతుందని మస్క్ చెప్పారు. అంగారకుడిపై నగరం నిర్మించాలనే మస్క్ దీర్ఘకాల లక్ష్యం మేరకు స్పేస్ ఎక్స్ మిషన్ ముందుకువెళుతోంది. అయితే 'ఇదంతా ఐదు నుంచి ఏడేళ్లలో ప్రారంభిస్తాం. కానీ నాగరికత భవితను రక్షించడమే అత్యంత ముఖ్యమైన పని. అయితే ఈ పని చంద్రుడిపైనే సాధ్యమయ్యే అవకాశం ఎక్కువ' అన్నారు. మస్క్ ప్రకటన తరువాత ఆయన అభిమానులు, ఫాలోవర్స్ చంద్రమండలంపై నగరం ఎలా ఉంటుందనే ఊహాచిత్రాలను గీసి పంచుకోవడం ప్రారంభించారు. కొందరు దీని కోసం మస్క్ కృత్రిమమేథ సాధనం గ్రోక్‌ను ఉపయోగించారు. మస్క్ ప్రకటనకు ముందు స్పేస్ ఎక్స్ మూన్ మిషన్లకే తొలిప్రాధాన్యం ఇచ్చి, తరువాత మార్స్‌పైకి ప్రయత్నాలు మొదలుపెడతామని ఇన్వెస్టర్లకు చెప్పిందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఈనెల మొదట్లో ప్రచురించిన తన కథనంలో పేర్కొంది. అయితే, అంతరిక్షంలో వాయురహిత స్థితి వల్ల గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను చల్లబరచడం పెద్ద సవాలుగా మారుతుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Post a Comment

0 Comments