హైదరాబాద్లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.5,050 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి ఒక్క రోజే రూ.350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగడం విశేషంగా మారింది. గత ఐదు రోజుల వ్యవధిలోనే రూ.1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే ఒక్క నెలలో రూ.5,000 కోట్లకు పైగా అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇది ఆల్టైం రికార్డ్గా పేర్కొంటున్నారు. సర్పంచ్ ఎన్నికల హడావుడి, న్యూ ఇయర్ వేడుకలు ఒకేసారి రావడం వల్ల డిసెంబర్ నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గత ఐదు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం లభించింది. మద్యం అమ్మకాలు ఊహించని స్థాయిలో పెరగడంతో కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణాల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు, ఎన్నికల వాతావరణం కలిసి రావడంతో డిసెంబర్ నెల లిక్కర్ సేల్స్ ఎక్సైజ్ చరిత్రలో నిలిచిపోయే స్థాయికి చేరాయని అధికారులు పేర్కొంటున్నారు.
0 Comments