ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అదనపు సిబ్బంది తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సుప్రీం సూచన


న్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాల్లో బూత్‌ స్థాయి అధికారులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్‌ఐఆర్‌ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం తీవ్ర ఒత్తిడి తెస్తోందని పిటిషన్‌లో పేర్కొనగా దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది. పని ఒత్తిడి తట్టుకోలేక పలువురు బూత్‌ స్థాయి అధికారులు రాజీనామా చేయడం, కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం, గడువులోగా పని పూర్తి చేయకపోతే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామని ఎన్నికల సంఘం బెదిరిస్తుందని పిటిషనర్‌ తరఫున న్యాయవాది పిటిషన్‌లో తీవ్రమైన ఆరోపణలు చేశారు.  చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల పనుల్లో పాల్గొనాల్సిన బాధ్యత ఉందని, అయితే వర్క్‌లోడ్‌ అధికమై ఇబ్బందులు పెరిగితే రాష్ట్రాలు అదనపు సిబ్బందిని నియమించుకోవచ్చని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ ధర్మాసనం పేర్కొంది. ఉద్యోగికి వ్యక్తిగత కారణాలు లేదా ఆరోగ్య సమస్యల వల్ల ఎస్‌ఐఆర్‌ విధుల నుండి మినహాయింపు అవసరమైతే ఆ స్థానంలో మరో అధికారిని ప్రత్యామ్నాయంగా నియమించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు సూచించిన మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తే పని ఒత్తిడి తగ్గుతుందని, అధికారుల భద్రత మెరుగుపడుతుందని, ఎన్నికల పనుల నాణ్యత కూడా పెరుగుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Post a Comment

0 Comments