ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ఈ రోజు కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం జరిగింది. కానిస్టేబుల్ గా నియమితుడైన గిరిజన యువకుడు లాకే బాబూరావు తన సక్సెస్ స్టోరీ వివరించే క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. బాబూరావు కోరిక మేరకు అతని గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు అప్పగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి చెందిన బాబూరావు చెప్పిన వివరాల మేరకు పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ.2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ కు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అల్లూరి జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేయడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది.
0 Comments