ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారుతుందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ విమానాశ్రయం పూర్తయితే, ఈ ప్రాంతంలో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా ఇది ఒక ప్రధాన కేంద్రంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఎయిర్పోర్ట్ పనుల్ని పరిశీలించారు, పనుల పురోగతిపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ఒక పెద్ద సవాలుగా స్వీకరించారన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా, అనుకున్న సమయానికి విమానాశ్రయాన్ని పూర్తి చేయడానికి అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. 2026 జూన్ నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారన్నారు. ఈ ఏడాది డిసెంబరు చివరి వారంలో లేదా వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో విమానాశ్రయంలో విమానం ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉందన్నారు. విమానాశ్రయం చుట్టూ ఐదు స్టార్ హోటళ్లు కూడా వస్తున్నాయని, దీనివల్ల స్థానికులకు వారి ప్రతిభకు తగిన ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తద్వారా, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారి సంఖ్య తగ్గుతుందన్నారు. భోగాపురం విమానాశ్రయం పనులు నాణ్యతతో జరుగుతున్నాయని, విశాఖపట్నం కంటే ఇక్కడ ఎక్కువ విమానాలు నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే కొన్ని ఎయిర్లైన్స్తో మాట్లాడామన్నారు. నావిగేషన్, ట్రాఫిక్ కంట్రోల్ సదుపాయాలు కల్పిస్తామని, గ్లోబల్ స్టాండర్డ్స్తో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నామన్నారు. భోగాపురం విమానాశ్రయంలో టాక్సీవే, రన్వేల నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం 91.7 శాతం పూర్తి అయిందన్నారు. భోగాపురంలో ఏవియేషన్ యూనివర్సిటీ నిర్మాణానికి కసరత్తు జరుగుతోందన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నామని, ఈ నెలలో విశాఖలో నిర్వహించబోయే పారిశ్రామిక సదస్సులో ఏవియేషన్ రంగానికి సంబంధించిన పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గతంలో కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు పునాది వేసిన ఈ విమానాశ్రయం చివరి దశకు రావడం చాలా సంతోషంగా ఉందని, భోగాపురం విమానాశ్రయం ఈ ప్రాంత రూపురేఖలను మార్చివేసి, అభివృద్ధిని వేగవంతం చేస్తుందని అన్నారు. ఆ తర్వాత, విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన జీఎంఆర్, ఎల్అండ్టీ అధికారులతో ఒక సమీక్ష సమావేశం జరిగింది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి విమానాశ్రయానికి త్వరగా చేరుకోవడానికి అవసరమైన కొత్త రోడ్ల నిర్మాణం, ట్రంపెట్ బ్రిడ్జి వంటి వాటిపై అధికారులతో చర్చించారు. ఈ కొత్త రోడ్లు, బ్రిడ్జిలు ప్రయాణ సమయాన్ని తగ్గించి, ప్రజలకు సౌకర్యంగా ఉంటాయని భావిస్తున్నారు. 'ఈ రోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించాను. ప్రధాన టెర్మినల్ భవనం, అరైవల్-డిపార్చర్ జోన్లు, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ తదితర కీలక సౌకర్యాలను పరిశీలించి, ఉత్తరాంధ్ర ప్రాంత సాంస్కృతిక ప్రత్యేకతను ప్రతిబింబించేలా డిజైన్లో మార్పులపై సూచనలు ఇచ్చాను. జీఎంఆర్, ఎల్అండ్టీ సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించి, మిగిలిన పనులను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని, ప్రతి అంశంలోనూ ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలని ఆదేశించాను. ప్రాజెక్టు ఇప్పటివరకు 91.7% పూర్తయినందుకు సంతోషంగా ఉంది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థికాభివృద్ధికి, వాణిజ్యానికి, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా మారనుంది. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును 2026 జూన్ నాటికి పూర్తి చేసి దేశానికి అంకితం చేయడానికి కట్టుబడి ఉన్నాము' అంటూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.
వచ్చే జూన్ లో భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభం
الأربعاء، 5 نوفمبر 2025
Andhra Pradesh Bhogapuram Greenfield Airport to be inaugurated in June the airport work was inspected and the progress of the work was inquired about To this end Union Minister Kinjarapu Rammohan Naidu
ليست هناك تعليقات:
إرسال تعليق