డిజిటల్ డాక్యుమెంట్ ప్లాట్ఫామ్ అయిన 'డిజిలాకర్'లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఈ-కేవైసీ, గ్లోబల్ క్రెడెన్షియల్ వెరిఫికేషన్ వంటి అత్యాధునిక సేవలను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్లతో డిజిలాకర్ వినియోగం మరింత సులభతరం, సురక్షితం కానుంది.కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ 'డిజిలాకర్పై జాతీయ సదస్సు'ను నిర్వహించింది. ఈ సందర్భంగా డిజిలాకర్ భవిష్యత్ ప్రణాళికలను అధికారులు వివరించారు. కేవలం పత్రాలను భద్రపరిచే వేదికగానే కాకుండా పౌరులకు, వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు మధ్య ఒక నమ్మకమైన వారధిగా (ట్రస్ట్ లేయర్) డిజిలాకర్ను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రభుత్వ, విద్యా, పారిశ్రామిక రంగాల్లో డిజిలాకర్ పాత్రను ఈ సదస్సులో ప్రముఖంగా చర్చించారు.
0 Comments