eWX నుండి ఫ్రాంక్స్ హైబ్రిడ్ వరకు కొత్త కాంపాక్ట్ వాహనాలను తీసుకురావడానికి సిద్ధమౌతున్న మారుతి సుజుకి


మారుతి సుజుకి రాబోయే సంవత్సరాల్లో  మార్కెట్లోకి eWX నుండి ఫ్రాంక్స్ హైబ్రిడ్ వరకు కొత్త కాంపాక్ట్ వాహనాలను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త మోడల్స్ అద్భుతమైన ఫీచర్లు, పెర్ఫార్మెన్స్, మైలేజ్‌తో భారతీయ కార్ల మార్కెట్‌లోని ఇతర బ్రాండ్‌లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. 

తక్కువ ధరలో ఒక చిన్న ఎలక్ట్రిక్ హాచ్‌బ్యాక్‌ను కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి, రాబోయే మారుతి సుజుకి eWX ఒక మంచి ఆప్షన్ అవుతుంది. చిన్న ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడే వారి కోసం మారుతి కొత్త కే-ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై దీనిని స్పెషల్‎ గా డెవలప్ చేశారు. సిటీలో రోజూ ప్రయాణించడానికి రూపొందించిన మారుతి సుజుకి eWX పూర్తిగా విద్యుత్‌తో నడుస్తుంది. అధికారిక వివరాలు ఇంకా ప్రకటించనప్పటికీ, eWX ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 230 కిలోమీటర్ల వరకు నడుస్తుందని నివేదికలు చెబుతున్నాయి. విడుదలైన తర్వాత eWX భారతదేశంలో అత్యంత అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ కారుగా మారుతుందని సమాచారం.

ప్రీమియం హాచ్‌బ్యాక్ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలనే లక్ష్యంతో, దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ 2027లో తమ కొత్త బాలెనోను విడుదల చేయనుంది. మెరుగైన డిజైన్, సరికొత్త ఇంటీరియర్, సేఫ్టీ ఫీచర్లతో అద్భుతమైన మార్పులతో ఈ ప్రీమియం హాచ్‌బ్యాక్ మార్కెట్‌లోకి వస్తుంది. కొత్త బాలెనో ప్రస్తుత 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తోనే కొనసాగుతుందని భావిస్తున్నారు. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడి ఉంటుంది. ఇది సుమారు 22-23 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. కాబట్టి, కొత్త మారుతి సుజుకి బాలెనో చాలా మంది ఎదురుచూస్తున్న మోడల్.

వైడీబీ అనే సీక్రెట్ కోడ్ నేమ్‎ తో వస్తున్న కాంపాక్ట్ ఎంపీవీ వచ్చే ఏడాదిలోనే మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు. ఇది మూడు వరుసల సీట్లు కలిగిన ఫ్యామిలీ వెహికల్ ‎గా తీసుకొస్తున్నారు. కాబట్టి, పెద్ద కుటుంబాలకు కూడా తక్కువ ధరలో సొంతం చేసుకోవడానికి ఇది మంచి కారు అవుతుంది. సుమారు 82 బీహెచ్‌పీ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.2 లీటర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను తమ రాబోయే ఎంపీవీలో అందిస్తారని భావిస్తున్నారు. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడి ఉంటుంది. సిటీలో, హైవేల మీద ప్రయాణాలకు అనువైన ఇంధన సామర్థ్యం, పనితీరును ఈ కొత్త కారు అందించగలదు.

2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో భారతదేశంలో విడుదల కాబోయే మారుతి సుజుకి మైక్రో ఎస్‌యూవీ సంచలనం సృష్టిస్తుందని అంచనా. టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి కార్లతో పోటీ పడటానికి సిద్ధమవుతున్న ఈ మైక్రో ఎస్‌యూవీ 1.2 లీటర్, 3-సిలిండర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుందని భావిస్తున్నారు.

మారుతి సుజుకి పురోగతిలో ఫ్రాంక్స్ హైబ్రిడ్ ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది. 2026 మధ్యలో భారతదేశంలో విడుదల కాబోయే ఈ చిన్న హైబ్రిడ్ కారు 1.2 లీటర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను 48వీ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో కలిపి 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని అంచనా.

Post a Comment

0 Comments