ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో మళ్లీ పులి వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్తిపాడు సమీప ప్రాంతాల్లో అది సంచరించినట్లు సమాచారం. బాపన్నధార పరిసర ప్రాంతాల్లో ఓ పశువు మృతి చెందడం అనుమానాలను బలపరుస్తోంది. ఈ ఘటనపై స్థానికులు అటవీ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివారం బాపన్నధార, ధారపల్లి, బురదకోట పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పులి సంచారంపై అధికారులు సోమవారం స్పష్టత ఇవ్వనున్నారు. 2022 మేలో 37 రోజుల పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పులి సంచరించింది. ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి, శంఖవరం, తుని మండలాల్లో సంచరించింది. ఇటీవల సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు సుమారు 45 రోజులు రాజమహేంద్రవరం, కడియం, ఆలమూరు, రావులపాలెం పరిసర ప్రాంతాల్లో పులి తిరిగింది. తాజాగా ప్రత్తిపాడు మండలంలోనూ సంచరించిందనే సమాచారంతో స్థానికులంతా భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం ప్రత్తిపాడు ప్రాంతంలో పోలీసులు విచారించారు.
0 Comments