కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్లోని మిల్టన్లో అక్టోబర్ 28న జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఖలిస్థాన్ ఉగ్రవాది అర్ష్ దల్లాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో జామీను మొత్తాన్ని అందజేసిన అనంతరం దల్లాకు బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే అతడిని తమకు అప్పగించాలని ఇటీవల కెనడాను భారత్ కోరింది. ఈ నేపథ్యంలో అర్ష్ దల్లాకు అక్కడి కోర్టు బెయిల్ ఇవ్వడం గమనార్హం. మన దేశంలో అతడిపై ఉన్న కేసుల్లో దల్లాను ప్రశ్నంచడానికి భారత అధికారులకు కోర్టు అవకాశం ఇవ్వలేదని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంపై కెనడా అధికారులతో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని భారత అధికారులు చెబుతున్నారు. పంజాబ్లోని మోగా జిల్లాకు చెందిన దల్లాపై భారత్లో హత్య, వేధింపులు, అపహరణ సహా పలు కేసులు ఉన్నాయి. గతేడాది జనవరిలో భారత ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. పెద్ద మొత్తంలో డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్లో అతడి పాత్ర ఉందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ కూడా తెలిపింది. దల్లాకు సంబంధించిన పలు కేసులను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. కెనడాలోని మిల్టన్ పట్టణంలో కాల్పుల ఘటనలో అతడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతడిని తమకు అప్పగించాలని భారత్ పలుమార్లు ట్రూడో ప్రభుత్వాన్ని కోరింది. ఖలీస్థానీ ఉగ్రవాది, గుర్తు తెలియని వారి కాల్పుల్లో హతమైన నిజ్జర్కు దల్లా సన్నిహితుడు.
0 Comments