ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణం చేయనున్న నేపథ్యంలో అమరావతిలో రియల్ ఏస్టేట్ కు ఊపు వచ్చింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరలు పెరుగుతున్నాయి. 2014లో టీడీపీ సర్కార్ అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో ఈ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి అంతా రివర్సైంది. లక్షలు పెట్టుబడులు పెట్టి ఇక్కడ భూములు కొనుగోలు చేసినవారంతా తట్టాబుట్టా సర్దుకున్నారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అమరావతిలో రియల్ ఏస్టేట్ కు పూర్వ వైభవం వస్తుందని నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో అమరావతిలో భూముల ధరలు పెరుగుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించడమే తమ విధానమని టీడీపీ, బీజేపీ, జనసేన ప్రకటించాయి. ఈ మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుకానున్నందున అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.
0 Comments