పవర్‌ బ్యాంక్‌లు, యూఎస్‌బీలతోనూ చైనా గూఢచర్యం ?


పాపులర్‌ పవర్‌ బ్యాంక్‌లు, యూఎస్‌బీ పోర్టులు, ఇంటర్నెట్‌ రౌటర్లను కూడా చైనా ఎటాక్‌ సిస్టమ్స్‌గా వినియోగిస్తోంది. ఒకవేళ వినియోగదారులు అలాంటి వాటిని ఇన్‌స్టాల్‌ చేసి లోకల్‌ నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ చేస్తే అవి సమాచార సేకరణను ప్రారంభిస్తాయి. సున్నితమైన డేటా, మేధోసంపత్తి చౌర్యం మొదలుపెడతాయి. భారత్ లక్ష్యంగా ఇలాంటి సైబర్ దుశ్చర్యలకు పాల్పడేందుకు ఐ-సూన్‌ అనే సంస్థను చైనా ప్రభుత్వం నియమించుకుందట. భారత్‌, యూకే, తైవాన్‌, మలేషియా సహా మొత్తం 20 దేశాల ప్రభుత్వాలపై గూఢచర్యం చేసేందుకు ఐ-సూన్‌ సంస్థను చైనా మోహరించింది. ఐ-సూన్‌ సంస్థకు చెందిన దాదాపు 517 పత్రాలను గిట్‌హబ్‌ అనే సంస్థ చేజిక్కించుకొని గత వారం ఆన్‌లైన్‌లో పోస్టు చేసింది. హ్యాకింగ్‌ ప్రపంచంలో ఉండే అరుదైన పరిస్థితులను ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ పత్రాలు ఎలా లీకయ్యాయన్న దానిపై ప్రస్తుతం చైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారత్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, వ్యాపార సంస్థలను ఐ-సూన్‌ అనే సంస్థ లక్ష్యంగా చేసుకున్నట్లు లీకైన పత్రాలు వెల్లడిస్తున్నాయి. రోజువారీ ఆఫీసుల్లో వినియోగించే పవర్‌ బ్యాంక్‌లు, యూఎస్‌బీ పోర్టులు, ఇంటర్నెట్‌ రౌటర్లలో మార్పులు చేసి.. వాటిలోకి వైఫై ప్రాక్సిమిటీ అటాక్‌ సిస్టమ్‌ వంటి కోవర్ట్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఐ-సూన్ సంస్థ చొప్పిస్తుందని తేలింది. ఫలితంగా వైఫైకు కనెక్ట్‌ అయ్యే ఆండ్రాయిడ్‌ ఫోన్లపై ట్రోజన్‌ హార్స్‌లు, మాల్‌వేర్‌లు దాడి చేసేందుకు వీలు లభిస్తుంది. ఇలాంటి పరికరాలలోని మాల్‌వేర్‌ చాలా వేగంగా.. ఫోన్లు, కంప్యూటర్లు, లాప్ ట్యాప్‌లలోని వ్యక్తిగత డేటా, కాంటాక్ట్‌ నంబర్లు, ఫొటోలు, వీడియోలను దోచేస్తుంది. ఎటువంటి అనుమానం రాకుండా మొత్తం డేటాను ఈ మాల్‌వేర్స్ చోరీ చేస్తాయి.

Post a Comment

0 Comments