మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా జిల్లా నల్ఖేడా పట్టణంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ బగులాముఖి ఆలయ సమీపంలో వర్షపు నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు యత్నించిన ఒక కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన భక్తులుగా పోలీసులు గుర్తించారు. ఆలయ దర్శనం నిమిత్తం వారు ఇక్కడికి వచ్చారు.ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మందిలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్డుపై ఉన్న వాగు ఉద్ధృతంగా పొంగిపొర్లుతోంది.ప్రవాహ తీవ్రతను సరిగ్గా అంచనా వేయకుండా డ్రైవర్ రోడ్డుపై ప్రవహిస్తున్న నీటిని దాటించేందుకు ప్రయత్నించారు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో కారు అదుపుతప్పి నీటి ప్రవాహంతో పాటు వాగులోకి కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ టీమ్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నీటిలో మునిగిపోయిన కారును గుర్తించి, అందులో చిక్కుకున్న ఎనిమిది మంది మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాగు దాటేందుకు యత్నించి ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు : ఎనిమిది మంది దుర్మరణం
Saturday, September 19, 2026
Agar Malwa district Car Swept Away While Attempting to Cross Raging Stream Eight Dead Madhya Pradesh. Sri Bagulamukhi Temple in Nalkheda town
No comments:
Post a Comment