రూ. 2,000 వరకు లావాదేవీలపై ట్రాన్సాక్షన్ లేదా సర్వీస్ ఛార్జీలు ఉండవు

చిన్న తరహా వ్యాపారులు, సాధారణ వినియోగదారులకు ఆర్థిక ఊరట కల్పిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం సెప్టెంబర్ 14న కీలక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నూతన నిబంధనల ప్రకారం యుపిఐ లేదా రూపే డెబిట్ కార్డ్‌ ద్వారా జరిపే రూ. 2,000 వరకు లావాదేవీలపై ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదా సర్వీస్ ఛార్జీలు విధించకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 లోని సెక్షన్ 10A కింద ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చాయి. బ్యాంకులు గానీ, పేమెంట్ గేట్‌వే సంస్థలు గానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వినియోగదారుల నుండి రూపాయి కూడా వసూలు చేయడానికి వీల్లేదు. ఈ నిర్ణయంతో రోజువారీ వ్యాపారం చేసుకునే కిరాణా షాపులు, వీధి వ్యాపారులు మరియు సామాన్య కస్టమర్లకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి దుకాణంలో రూ. 1,500 యూపీఐ ద్వారా చెల్లిస్తే చెల్లించే కస్టమర్‌పై గానీ, డబ్బు పొందే మర్చంట్‌పై గానీ ఎలాంటి అదనపు రుసుముల భారం పడదు. రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే పెద్ద వ్యాపార లావాదేవీలకు సంబంధించి ప్రత్యేక ఛార్జీలను ఈ నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు. అయితే, సాధారణ పర్సన్-టు-పర్సన్ జరిపే నగదు బదిలీలు ఎప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పెద్ద మర్చంట్ ట్రాన్సాక్షన్లకు మినహాయింపులు ఉన్నప్పటికీ, సామాన్యుల రోజువారీ చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది కలగదని కేంద్రం స్పష్టం చేసింది.

Post a Comment

0 Comments